ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రతిపక్షాలు, అధికార పక్షం పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణం వేడెక్కిస్తున్నాయి. వైజాగ్లోని రిషికొండపై ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతుందంటూ విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో దశ సందర్భంగా రిషికొండ నిర్మాణాలను పరిశీలించి సీఎం జగన్పై ఘాటు విమర్శలు చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో సర్కార్ కౌంటర్ ఎటాక్కు దిగుతూ వైసీపీ అధికారిక పేజీ నుంచి ఓ ట్వీట్ చేసింది.
ఇప్పుడు ఆ ట్వీట్ టీడీపీ, వైసీపీ మధ్య రచ్చకు దారి తీసింది. "ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి. రిషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు వైఎస్ జగన్ గారు" అని శనివారం ట్వీట్ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ వెంటనే ఆ ట్వీట్ను తొలగించింది.
దీంతో "ఈ ట్వీట్ ఎందుకు డెలీట్ చేసావ్ 'బుజ్జి కన్నా'? భయం వేసిందా? సిగ్గేసిందా? తాడేపల్లి సైకో నుంచి కోటింగ్ పడిందా ?" అంటూ టీడీపీ ప్రశ్నించింది.
దీనిపై వెంటనే స్పందించిన వైసీపీ "మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు"అని పేర్కొంది.
"ఎన్ని కవర్ డ్రైవులు కొట్టినా ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేసావు! థాంక్స్ బ్రో!" అంటూ టీడీపీ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసింది.
"మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి. అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది" అని వివరణ ఇస్తూ వెంటనే వైసీపీ మరో ట్వీట్ చేసింది.
"తప్పుడు రాతలు, తప్పుడు కూతలు.. మా సాక్షి తప్పు.. మా సైకో తప్పు.. మా అధికారిక ఖాతా తప్పు.."అంటూ టీడీపీ కౌంటర్ ట్వీట్లో పేర్కొంది. మొత్తానికి ఇలా రెండు పార్టీల మధ్య ట్వీట్ వార్ జరిగింది.