TSPSC: టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతోంది?.. సభ్యుల రాజీనామా

టీఎస్పీఎస్సీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ సమగ్ర ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

New Update
TSPSC: టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతోంది?.. సభ్యుల రాజీనామా

TSPSC: టీఎస్పీఎస్సీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం సాయంత్రం చైర్మన్ జనార్దనరెడ్డి (Janardhan Reddy) రాజీనామా చేయగా, మంగళవారం సాయంత్రం బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ (R Satyanarayana) రిజైన్ చేశారు. మరికాసేపటికే మిగతా నలుగురు బోర్డు సభ్యులూ రాజీనామాలను అందించారు. సభ్యులు బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్, కారెం రవీంద్ర రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. అది అలా ఉండగానే సభ్యులు పదవుల నుంచి తప్పుకున్నారు.

‘తప్పు చేయలేదు.. కానీ, తప్పుకుంటున్నా’

తాను ఏ త‌ప్పూ చేయలేదని, అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా త‌ప్పుకుంటున్నాన‌ని సత్యనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాము బాధ్య‌తలు నిర్వ‌ర్తించే వాతావ‌ర‌ణం లేదన్నారు. ఉద్యోగార్థుల ఆకాంక్ష‌ల‌ను గౌర‌విస్తూ కొత్త క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలోనే నియామ‌కాలు జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ విద్యార్థులు, నిరుద్యోగుల ప‌క్ష‌మే అని స్పష్టంచేశారు. యువత ఆశ‌లు, ఆకాంక్ష‌లు వీలైనంత త్వ‌ర‌గా నెర‌వేరాల‌ని కోరుకుంటున్నట్లు స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.

ఏం జరగనుంది?!

టీఎస్పీఎస్సీ (TSPSC) సమగ్ర ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా, టీఎస్పీఎస్సీకి కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని ఆ పదవుల్లో నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విద్యావేత్తలు, ప్రొఫెసర్లకు టీఎస్పీఎస్సీలో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

పాత నోటిఫికేషన్లు కొనసాగిస్తారా?
పేపర్ లీకేజీలు, పరీక్షల వరుస వాయిదాలతో మసకబారిన బోర్డు ప్రతిష్ఠను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లను కొనసాగిస్తూ వాటికి పరీక్షలు నిర్వహిస్తారా.. లేదా వాటిని రద్దు చేసి పోస్టుల సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తారా.. అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు