MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తుది చార్జ్షీట్పై విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు ఇచ్చిన చార్జ్షీట్ కాపీలో స్పష్టత లేదని, గజిబిజిగా అందించారని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు గతంలో చెప్పారు. స్పష్టతతో, సరైన విధానంలో చార్జ్షీట్ కాపీ ఇవ్వాలని దర్యాప్తు సంస్థను అప్పుడే ఆదేశించింది రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సరైన విధానంలో చార్జ్షీట్ కాపీని ప్రతివాదులకు అందించనున్నట్లు కోర్టుకు సీబీఐ చెప్పింది.
చార్జ్షీట్లో కొన్ని అంశాలు పొందుపరిచిన కాపీలను ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు. తమకు ఇచ్చిన కాపీలో తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు సరిగ్గా లేవని కోర్టుకు చెప్పాడు. ప్రతివాదులు అడిగిన కాపీలను ఇవ్వాలని సీబీఐని మరోసారి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన తుది చార్జ్షీట్ పై విచారణను ఈనెల 25కి ట్రయల్ కోర్టు వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు నిందితులు హాజరయ్యారు.
ఛార్జిషీటులో కవితపై అభియోగాలు ఏంటి?
2022 నవంబర్ 26న లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న సమీర్ మహేంద్ర అతడికి సంబంధించిన నాలుగు కంపెనీలపై మొదటిసారిగా ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను ఈడీ పేర్కొంది. ఇందులో కవిత పేరును కూడా ప్రస్తావించింది. ఆ తర్వాత డిసెంబర్లో కూడా కవిత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించింది. మరోసారి కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఛార్జీషీటులో ప్రస్తావించింది.
సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్లో కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు కూడా ఉన్నాయి. సమీర్కు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు ఈడీ అభియోగం మోపింది. ఎల్-1 లైసైన్స్ కింద వచ్చిన షాపుల్లో కవితకు ఈ వాటా ఉందని తెలిపింది. ఒబెరాయ్ హోటల్లో జరిగిన మీటింగ్లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్నాయర్ పాల్గొన్నట్లు చెప్పింది. ఇండో స్పిరిట్ను కవిత వెనకుండి నడిపించారని.. ఈ కంపెనీలో నిజమైన భాగస్వాములు కవిత, మాగుంట శ్రీనివాస్రెడ్డి అని ఈడీ చార్జ్షీట్లో వెల్లడించింది.
ఆ తర్వాత 2023 మార్చిలో కవిత అరెస్టయ్యాక మే నెలలో కూడా ఈడీ ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో కవిత పేరుతో పాటు ఇదే కేసుతో సంబంధం ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, ఛన్ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్ పేర్లను కూడా ఈ ఛార్జ్షీట్లో పొందుపర్చారు. అప్పటివరకు జరిగిన ఈ కేసుకు సంబంధించిన విచారణ వివరాలను అందులో వివరించారు. అయితే 2022 నాటి గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున కవిత ప్రచార వ్యవహారాలు, దానికి అయ్యే ఖర్చును హ్యాండిల్ చేశారని ఈడీ అధికారులు ఛార్జిషీట్లో వెల్లడించారు. ఆ మొత్తం డబ్బంతా అక్రమంగా ఆర్జించిందేనని తెలిపారు. ఈ కేసులో మొత్తం రూ.100 కోట్ల స్కామ్ జరిగిందని తేల్చిచెప్పారు.