Hydra: దుండిగల్ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. FTL, బఫర్జోన్ల నిర్ధారణలో నీటిపారుదలశాఖ గోల్మాల్ చేసింది. అధికారుల నిర్లక్ష్యంతో విల్లా ఓనర్లు బలయ్యారు. కత్వ చెరువు బఫర్జోన్ పరిధిలో 8 విల్లాలు ఉన్నాయని మూడేళ్ల కిందట నీటిపారుదలశాఖ అధికారుల సర్వే రిపోర్టు ఇచ్చారు. తాజాగా మళ్లీ సర్వే చేసి బఫర్జోన్లో 8 విల్లాలకు అదనంగా మరో 20 ఉన్నాయని రెవెన్యూ అధికారులు తేల్చారు. రెవెన్యూ అధికారుల నివేదికతో 20 విల్లాల్లో 13 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేశారు.
ఇటీవల కూల్చివేతలు షురూ...
హైదరాబాద్లో హైడ్రా దూకుడు మరింత పెరిగింది. గత వారం వర్షాల కారణంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చిన అధికారులు మరోసారి కూల్చివేతలు మొదలుపెట్టారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కత్వా చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే ఈ చెరువు స్థలంలో నిర్మించిన 8 విల్లాలను సైతం నెలమట్టం చేయగా.. మరో 12 విల్లాలకు నోటీసులు ఇచ్చారు.
15 ఎకరాల చెరువు స్థలంలో విల్లాలు..
ఈ మేరకు కత్వా చెరువు స్థలం ఆక్రమణకు గురైందని స్థానికుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన హైడ్రా.. లక్ష్మి శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మొత్తం 330 విల్లాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. అయితే అందులో FTL, బఫర్జోన్లో సుమారు 15 ఎకరాల చెరువు స్థలంలోనే విల్లాలు నిర్మించినట్లు గుర్తించింది. దీంతో 8 విల్లాలను ఎక్కడికక్కడ కూల్చివేసింది హైడ్రా.
అయితే ఈ కూల్చివేతలపై విల్లా యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని పర్మిషన్లతోనే విల్లా కట్టుకున్నామని, నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షించకుండా మా ఇళ్లను ఎలా కూలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై కేవలం కేసు పెట్టి వదిలేస్తే సరిపోదని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.