Covid New Varient: కరోనాపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. గాంధీ ఆస్పత్రి వైద్యుల కీలక ప్రకటన!

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. గాంధీ ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అన్నారు.

Covid New Varient: కరోనాపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. గాంధీ ఆస్పత్రి వైద్యుల కీలక ప్రకటన!
New Update

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అంతరించిందనుకున్న మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. చాపకింద నీరులా దేశవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ఈ క్రమంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

రానున్న పండగల సీజన్ లో కోవిడ్ వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. డబ్ల్యూహెచ్ ఓ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకుకేంద్రం స్పష్టం చేసింది. కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలు చేయాలని వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులను నిర్వహించాలని సూచించింది.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్:

ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయ్యింది . కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు . సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదని చెప్పారు.

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. లక్షణాలివే!

అటు దేశంలో కొత్త కరోనా వేరియంట్ టెన్షన్ పట్టుకుంది. జెఎన్ 1 వేరియంట్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశంలో అంతకంతకూ కేసులు పెరుగుతూనే ఉన్ాయి. ఈ వైరస్ సోకి కేరళలో నలుగురు మరణించగా..యూపీలో మరొకరు మరణించారు. కేరళలో జెఎన్ 1 వేరియంట్ సోకి 79 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. దీంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని సూచించింది. పాజిటివ్ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని లేఖ రాసింది. 60ఏళ్లు పై బడిన వారికి మాస్క్ తప్పనిసరి అని కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళ సరిహద్దులో బందోబస్తును పెంచిన కర్నాటక… కేసులు ఎక్కువైతే రాకపోకలు బంద్ చేస్తామని ప్రకటించింది. చలికాలం కావడంతో వైరస్ ను నియంత్రించడం కష్టం మారుతుందని వైద్యులు అంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కేరళలో జేఎన్‌.1 వేరియంట్‌ వెలుగుచూడటంతో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాబోయే పండుగల సీజన్‌ దృష్ట్యా మాస్కులు ధరించాలని చెబుతున్నారు. 

జెఎన్ 1 వేరియంట్ లక్షణాలు:

జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. గత వేరియెంట్‌లతో పోలిస్తే జేఎన్‌.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు. పైగా ఆస్పత్రుల్లో చేరాల్సినంత అవసరమూ రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా.. ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా చేతులు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు.

అటు అమెరికా, చైనా తర్వాత భారత్ లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్ లో మొదటి కేసు నమోదు అయ్యింది. ఈ వేరియంట్ ఇప్పటివరకు 11దేశాల్లో విస్తరించింది. కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగానే ఉంటుందని అమెరికా వెల్లడించింది.

అటు సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 56 వేల కేసులు నమోదు అయ్యాయి. అదీ వారం వ్యవధిలోనే నమోదు కావడంతో మాస్క్‌ను తప్పనిసరి చేసింది ఆ దేశం. కేసులు పెరుగుతుంటే లాక్‌డౌన్‌ విధించే ఆలోచన చేస్తామని చెబుతోంది. మరోవైపు మలేషియాలోనూ 20వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఐతే ఈ రెండు దేశాల్లో వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కారణమా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం.. పురంధేశ్వరి చురకలు

#covid-new-varient #telangana-govt-alerted
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe