/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Minister-KTR-1-jpg.webp)
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections 2023) పూర్తయిన తర్వాత టీఎస్పీఎస్సీని (TSPSC) పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటించారు. డిసెంబర్ 4న ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న యువతతో అశోక్ నగర్ వెళ్లి సమావేశం అవుతానని ప్రకటించారు. టీఎస్పీఎస్సీలో శాశ్వత ఉద్యోగులను నియమిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులతో ఈ రోజు మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను, భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను మంత్రి వారికి వివరించారు. ఇందుకు సంబంధించిన లెక్కలను వారికి అందించారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. నిరుద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పోస్టుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ను ను విడుదల చేస్తామన్నారు.
Had an insightful conversation with the Govt job aspirants from Ashok Nagar who came to meet me with a hope to find a way forward
Assured them that the future is bright and will be meeting them at their adda immediately after election pic.twitter.com/CHBRxuuzzj
— KTR (@KTRBRS) November 20, 2023
ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చెబుతోంది. మేనిఫెస్టోలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ను ఏ తేదీ రోజు విడుదల చేస్తామో ప్రకటించి నిరుద్యోగులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు స్పష్టమైన భరోసా ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ ఈ రోజు నిరుద్యోగులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. మరో ఒకటి రెండు, రోజుల్లో బీఆర్ఎస్ నుంచి నిరుద్యోగులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా మరికొన్ని హామీలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.