Telangana Elections 2023: పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్ (Postal Ballet) ఓటు అందని వారు తాము ఓటు వేయవలసి ఉన్న నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని సంప్రదించాలని ఈసీ సూచించింది. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని చూపించి సిబ్బంది వారి నుంచి పోస్టల్ బ్యాలెట్ తీసుకోవచ్చని వెల్లడించింది. వారు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయవచ్చు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు షాక్.. ఈసీ నోటీసులు
వివిధ శాఖల ఉద్యోగులకు సరైన సమయంలో పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడంతో వారు తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. వేరే జిల్లాల నుంచి రావాల్సిన పోస్టల్ బ్యాలెట్లలో జాప్యం, శిక్షణ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకపోవడం, రిటర్నింగ్ అధికారులు కూడా సరైన సమాచారం అందించలేకపోవడం వారిని ఆందోళనకు గురిచేసింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్పై ఈసీకి బీజేపీ కంప్లైంట్.. తెలంగాణ పత్రికల్లో కర్ణాటక స్టేట్ యాడ్స్పై ఫైర్!
మరోవైపు జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో రిటర్నింగ్ అధికారుల వివరణల్లోనూ వైరుధ్యాలున్నాయి. 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా రిటర్నింగ్ అధికారులు చెప్తుంటే, నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు మాత్రం గడువు ముగిసిందని సమాధానమిస్తున్నట్లు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గతంలో తహశీల్దార్ కార్యాలయంలోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే, ఈసారి సొంత నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దగ్గరే ఓటేయాలన్న నిబంధన తెచ్చారు. ఇది కూడా అయోమయానికి కారణమైంది. ఈ నేపథ్యంలో గందరగోళాన్ని పరిష్కరించే దిశగా ఎన్నికల సంఘం చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.