TG News: తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే దిలీప్ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన..
కొణతం దిలీప్ అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్.. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి రాలేదంటూ ఫైర్ అయ్యారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే?అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చని అనుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారు. అక్రమంగా దిలీప్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలి. 9 నెలలుగా తెలంగాణలో వాక్స్వాతంత్ర్యం లేదు. నిరంకుశ పాలన సాగుతోందన్నారు.