Alleti Maheshwar Reddy On CM Revanth Reddy: తెలంగాణ చిహ్నంలో (Telangana Emblem) అమరవీరుల స్థూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే.. చిహ్నంలో చార్మినార్ ను తొలగించే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణలో ముస్లీం పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లు చాలా ఉన్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగిస్తామన్నారు. చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. కాకతీయ తోరణం (Kakatiya Thoranam) లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమన్నారు.
కాకతీయ తోరణం రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనన్నారు. ఎదులాపురం పేరును అదిలాబాద్ గా మార్చి రాజరికం పేరు పెట్టారన్నారు. సికింద్రాబాద్ ను లష్కర్ గా, మహబూబ్ నగర్ ను పాలమూరు గా, నిజామాబాద్ ను ఇందూరుగా ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో సాంస్కృతిక పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ కొత్త సచివాలయంలో 34 గుమ్మటాలు ఓవైసీ ఆనందం కోసమనే నిర్మించారని ఫైర్ అయ్యారు. వాటిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రాచరికం ఆనవాళ్ళు అక్కడ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇంకా.. తెలంగాణ ఉద్యమ కారులకు రూ.25 వేలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారాడని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు.