/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-19T163155.919.jpg)
అంతర్జాతీయ క్రికెట్ పసికూనజట్లు ఎస్తోనియా- సైప్రస్ జట్ల నడుమ జరుగుతున్న ఆరుమ్యాచ్ ల ద్వైపాక్షిక సిరీస్ రెండో టీ-20 మ్యాచ్ లోనే సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. ఎస్తోనియా జట్టులోని భారత సంతతి బ్యాటర్ సాహిల్ చౌహాన్ కేవలం 27 బంతుల్లోనే మెరుపు శతకం బాదడం ద్వారా గతంలో ఉన్న 33 బంతుల ప్రపంచ రికార్డును తెరమరుగు చేయగలిగాడు. ఈ ఏడాది ప్రారంభంలో నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ సాధించిన 33 బాల్ శతకం రికార్డును సాహిల్ 27 బంతుల సెంచరీతో అధిగమించాడు.
192 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఎస్తోనియా మొదటి 8 బంతుల్లోనే ఓపెనర్ల వికెట్లు, పవర్ ప్లే ఓవర్లు ముగిసే నాటికి టాపార్డర్ లోని మూడు వికెట్లు నష్టపోయి ఎదురీదుతున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన సాహిల్ శివమెత్తిపోయాడు. పూనకం వచ్చినవాడిలా బ్యాట్ ఝళిపిస్తూ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. సాహిల్ విధ్వంసకర బ్యాటింగ్ తో కేవలం 13 ఓవర్లలోనే ఎస్తోనియా 6 వికెట్ల విజయం సాధించింది.