సునీల్ నరైన్‌ను ఏడాది నుంచి బతిమలాడుతున్న: వెస్టిండీస్ కెప్టెన్

New Update
సునీల్ నరైన్‌ను ఏడాది నుంచి బతిమలాడుతున్న: వెస్టిండీస్ కెప్టెన్

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సునీల్.. గతంలో గంభీర్ చొరవతో ఓపెనర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టడంతో సునీల్ నరైన్ మళ్లీ ఓపెనర్‌గా మారి అదరగొట్టే ప్రదర్శన చేస్తున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన నరైన్ (56 బంతుల్లో 109) తర్వాత 4 ఓవర్లు బౌలింగ్ చేసి 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లతో సత్తా చాటాడు. రెండు జట్లలోనూ అందరు బౌలర్లకన్నా తక్కువగా పరుగులిచ్చింది నరైనే కావడం విశేషం.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన జోష్ బట్లర్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి.. సెంచరీ చేయడంతోపాటు రాజస్థాన్‌ను గెలిపించాడు కానీ.. లేకపోతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నరైన్‌కే దక్కాల్సింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతోపాటు.. వికెట్ తీసి, ఓ క్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ రికార్డ్ క్రియేట్ చేశాడు.ఐపీఎల్ 2024లో మెరుపులు మెరిపిస్తోన్న సునీల్ నరైన్.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రథమ స్థానంలో ఉన్న కోహ్లి 7 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేయగా.. రెండో స్థానంలో ఉన్న రియాన్ పరాగ్ 7 మ్యాచ్‌ల్లో 318 రన్స్ చేశాడు. సునీల్ నరైన్ ఆరు మ్యాచ్‌ల్లో 276 రన్స్‌తో మూడో స్థానానికి చేరుకున్నాడు.

లీగ్ క్రికెట్ల్ ఈ రేంజ్‌లో సత్తా చాటుతోన్న సునీల్ నరైన్.. 2019 ఆగస్టు తర్వాత వెస్టిండీస్ తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది నవంబర్‌లో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. నరైన్ వెస్టిండీస్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఆడిన మ్యాచ్‌ల కంటే.. అతడు కోల్‌కతా తరఫున ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లే ఎక్కువ.టీ20ల్లో సునీల్ నరైన్ ఎంత విలువైన ఆటగాడో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌కు బాగా తెలుసు. అందుకే జూన్‌ నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ తరఫున ఆడేలా అతణ్ని ఒప్పించడం కోసం పావెల్ చేయని ప్రయత్నం లేదు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడే విషయమై ఓసారి ఆలోచించు అంటూ 12 నెలలుగా సునీల్ నరైన్ చెవిలో జోరీగలా చెబుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదని పావెల్ వాపోయాడు.

‘సునీల్ నరైన్‌ను ఒప్పించమని అతడి బెస్ట్ ఫ్రెండ్‌ను అడిగాను. నరైన్‌తో మాట్లాడమని పోలార్డ్‌ను అడిగాను, బ్రావోను అడిగా, పూరన్‌ను కూడా అడిగాను. కానీ ఎవ్వరు చెప్పినా అతడు ఒప్పుకోలేదు. టీ20 వరల్డ్ కప్‌కు మేం టీమ్‌ను ఎంపిక చేసేలోపైనా వారు అతణ్ని ఒప్పిస్తారేమో చూడాలి’’ అని ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతోన్న పావెల్ తెలిపాడు.

Advertisment
తాజా కథనాలు