Dwaraka: కెరటాల అడుగున మునిగిన ద్వారకనూ దర్శించొచ్చు.. గుజరాత్‌ ప్రభుత్వ సబ్‌మెరైన్‌ సేవలు

తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భక్తుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. సబ్‌మెరైన్‌లను ఉపయోగించి సముద్ర గర్భంలోని ద్వారక నగరాన్ని దర్శించుకునే వెసులుబాటును కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

New Update
Dwaraka: కెరటాల అడుగున మునిగిన ద్వారకనూ దర్శించొచ్చు.. గుజరాత్‌ ప్రభుత్వ సబ్‌మెరైన్‌ సేవలు

Dwaraka: కెరటాల అడుగున, కనుచూపు మరుగున నిదుర పోతున్న కృష్ణుడు ఏలిన ద్వారక దర్శనం భక్తులకిక అసాధ్యమేమీ కాదు! ఏటా వేలాదిగా భక్తులు తరలివస్తున్నా సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను దర్శించుకోవాలన్న వారి ఆకాంక్ష ఇన్నాళ్లూ తీరలేదు. అయితే, తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భక్తుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. సబ్‌మెరైన్‌లను ఉపయోగించి సముద్ర గర్భంలోని ద్వారక నగరాన్ని దర్శించుకునే వెసులుబాటును కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దాంతో ద్వారక దర్శనంతో పాటు సముద్ర గర్భంలోని ఇతర జీవ సంబంధ విశేషాలను కూడా భక్తులు వీక్షించొచ్చు.

ఇది కూడా చదవండి: India – Italy: విద్యార్థులకు వరం.. భారత్, ఇటలీ మధ్య ‘మెలోడీ’ లాంటి ఒప్పందం..!

భారతం సమయంలో విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించాడని పురాణ కథనం. ఈ నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులకు అక్కడికి వెళ్లే అవకాశం కలగలేదు. ఇప్పుడు ఇందుకోసం సబ్‌మెరైన్‌ సేవలను ప్రారంభించేందుకు ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజగాన్‌తో గుజరాత్‌ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రభుత్వ నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఒక్కో జలాంతర్గామీ ఒక సమయంలో 24 మంది యాత్రికులను సముద్ర గర్భానికి తీసుకెళ్లగలదని గుజరాత్‌ టూరిజం శాఖ అధికారులు తెలిపారు. టూరిస్టులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్‌, గైడ్‌ కూడా అక్కడికి వెళ్తారని వెల్లడించారు. సబ్‌మెరైన్‌లు భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల వరకూ దిగువకు తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమం గుజరాత్‌ పర్యాటక రంగానికీ మరింత ఊతమిచ్చే అవకాశముంది.

ఇది కూడా చదవండి: IPS Arrest: ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్టు.. ఇంటి కబ్జాకు యత్నించారని రిటైర్డ్ ఐఏఎస్ ఫిర్యాదు

Advertisment
తాజా కథనాలు