MLA Bhumana Karunakar Reddy Comments on Chandrababu: చంద్రబాబు అరెస్ట్పై వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. వెన్నుపోటు బాబుకు(Chandrababu) నేడు చట్టం పెన్ను పోటు గుచ్చుకుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ బ్లాక్ డే కామెంట్స్ చేసే వ్యక్తులు నిజానిజాలు తెలుసుకోవాలని హితవు చెప్పారు. ఆదర్శ రాజకీయ నేపథ్యం ఏమాత్రం లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు దగ్గర అవినీతి, మోసం, కుట్ర రాజకీయాలు నేర్చుకోవచ్చునని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను లోబరుచుకొని రాజకీయాలలో ఎదిగిన ఆగంతకుడు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చట్టానికి దొరకకుండా బాబు చేసిన దోపిడీలు లక్షల కోట్లు అని ఆరోపించారు. అబద్ధాలను సైతం తన గొప్పలుగా చెప్పుకోగల నేర్పరి బాబు అని విమర్శించారు.
జోగయ్య ఆత్మకథలో రంగా చావుకు కారణం చంద్రబాబే అని రాసుకున్న విషయాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్యే భూమన. స్కిల్ డెవలప్మెంట్ అవినీతిని సిట్ అధికారుల కష్టఫలితంతో బయటకు వచ్చిందన్నారు. చంద్రబాబుపై హత్యాప్రయత్నం జరిగిన నాడు ప్రజానీకం సైతం సానుభూతి చూపలేదని, నేడు చంద్రబాబుపై సానుభూతి చూపుతున్న పవన్, కమ్యూనిస్టులకు ఏ లబ్ధి చేకూరదన్నారు.
2019 ఎన్నికలలో బాబును చిత్తుచిత్తుగా ఓడించారని, మూడున్నర ఏళ్ళు బయటకు రాకుండా దాకున్నాడని ఎద్దేవా చేశారు భూమన. అసమర్థుడైన లోకేష్ పాదయాత్రతో చంద్రబాబు అవినీతిని దాచిపెట్టాలని చూసినా అది సాధ్య పడలేదన్నారు. ఇవాళ చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర ప్రజలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కాదు, నిజాయితీ ముఖ్యం అని చెప్పుకొచ్చారు. సోనియాతో కలిసి సిబిఐని ఉసిగొలిపి జగన్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు భూమన.
చంద్రబాబు అరెస్ట్ ఏ మాత్రం ప్రతీకార చర్య కాదని, నేరం చేసిన వ్యక్తికి పడే స్థితి అతనికి పట్టిందంటూ తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే భూమన. పొలాలకు నీరు మళ్ళిస్తానని, తన ఖాతాలకు ప్రభుత్వ, ప్రజా ధనాన్ని మళ్ళించుకున్నాడని ఆరోపించారు. అవినీతి పరులను సమర్థించే వారు చట్టం దృష్టిలో దోషులే అన్నారు. చంద్రబాబు ఇంకా చాలా బలమైన అవినీతి, అక్రమ కేసులలో అరెస్టులు కావల్సి వుందన్నారు. చంద్రబాబు తన బాధ ప్రపంచ బాధాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని,
2019 ఎన్నికలలో ప్రజా కోర్టులో శిక్ష పడిందని, 2024లోనూ చావు దెబ్బ తగలడం ఖాయం అన్నారు. చంద్రబాబుకు బుద్ది చెప్పగల ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అని పేర్కొన్నారు ఎమ్మెల్యే భూమన. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పైనా తీవ్ర కామెంట్స్ చేశారు. ఆమె ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారనుకుని ట్వీట్లు చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు.
Also Read:
Chandra Babu Arrest Live Updates: చంద్రబాబుకు బెయిలా? జైలా?..