Vikram lander soft lands on Moon again: చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఇస్రో... తాజాగా మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. "విక్రమ్ ల్యాండర్ తనకు అప్పగించిన విధులకు మించి పనిచేసింది. ఇది హాప్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. మా కమాండ్ని అనుసరించి.. అది తన ఇంజిన్లను మండించింది. తనకు తానుగా మళ్లీ 40 సెంటీమీటర్లు పైకి లేచింది. మా అంచనాలకు తగినట్లే లేచింది. ఇప్పుడు ఉన్న ప్రదేశం నుంచి 30 లేదా 40 సెంటీమీటర్ల దూరంలో మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది." అని ట్వీట్ చేసింది.
సెప్టెంబర్ 3వ తేదీన దీనిని నిర్వహించినట్టుగా ఇస్రో తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇస్రో షేర్ చేసింది. ఈ వీడియోలో ల్యాండర్ పైకి లేవడం.. తిరిగి సాఫ్ట్ ల్యాండ్ అవ్వడం స్పష్టంగా కనపడుతుంది. పైకి లేచిన సమయంలో దుమ్ము, ధూళి లేవడం వీడిడియోలో కనిపించింది. భవిష్యత్లో మనుషులు, మిషన్లను వెనక్కి రప్పించే ప్రక్రియలో భాగంగా ఈ ప్రయోగం చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Chandrayaan-3 Mission:
🇮🇳Vikram soft-landed on 🌖, again!Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.
On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI
— ISRO (@isro) September 4, 2023
Also Read: ఆదిత్య ఎల్-1 సక్సెస్.. ఇస్రో నెక్ట్స్ టార్గెట్ అదేనా? ఇంట్రస్టింగ్ అప్డేట్స్ మీకోసం..
ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా తనకు అప్పగించిన పనిని ప్రజ్ఞాన్ రోవర్ పూర్తి చేసిందని ఇస్రో తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్లీప్ మోడ్లో సురక్షిత ప్రదేశంలో దానిని పార్క్ చేశామని పేర్కొంది. రోవర్, ల్యాండర్ విక్రమ్ సక్రమంగా పనిచేస్తున్నాయని.. ల్యాండర్ చుట్టూ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్లు ప్రయాణించిందని తెలిపింది. రోవర్ పేలోడ్స్ను ఆఫ్ చేశామని.. అందులోని డేలా ఇప్పటికే ల్యాండర్ ద్వారా తమకు చేరిందని చెప్పింది. ప్రస్తుతానికైతే దాని బ్యాటరీ ఫుల్గా చార్జ్ అయి ఉందని.. ఈనెల 22న చంద్రుడి మీద సూర్యకిరణాలు పడగానే దానికి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించింది. తిరిగి ప్రారంభమై మళ్లీ తన పనిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని లేదంటే జాబిల్లిపై భారత శాశ్వత రాయబారిగా రోవర్ అక్కడే నిలిచిపోతుందని ప్రకటించింది.
అంతకుముందు చంద్రుడి ఉపరితలంపై రోవర్ 100 మీటర్ల దూరం ప్రయాణం పూర్తి చేసుకుందని ఇస్రో తెలిపింది. “ప్రజ్ఞాన్ 100 నాటౌట్” అంటూ ఓ ట్వీట్ చేసింది. రోవర్ని మరో రెండు రోజుల్లో స్లీప్ మోడ్లో పెడతామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. కాగా చంద్రుడి ఉపరితలంపై రెండు వారాల పాటు పరిశోధనలకు చంద్రయాన్-3 మిషన్కు రూపకల్పన చేశారు.
Also Read: షార్లో విషాదం.. వాయిస్ ఆఫ్ ఇస్రో, శాస్త్రవేత్త వలర్మతి ఇక లేరు!