Hyderabad- Vijayawada Train: హైదరాబాద్, విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్, విజయవాడ మధ్య తిరిగి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలతో వచ్చిన వరదతో మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. తాజాగా ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో అధికారులు రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించారు. విజయవాడ నుండి వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను ఈరోజు అధికారులు ప్రారంభించారు. ట్రయల్ రన్గా మొదట విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్ ప్రెస్ను అధికారులు పంపించారు. ఈ ట్రైన్ గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా హైదరాబాద్కు చేరుకుంటుంది.
భారీ వర్షాల కారణంగా ఇటీవల మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో తెలంగాణ, ఏపీ మధ్య రైళ్ల రాకపోకలు స్తంభించాయి. వెంటనే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు మొదలు పెట్టారు.మూడు రోజులు రాత్రి పగలు కష్టపడి రైల్వే ట్రాక్ ను సిద్ధం చేశారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగనున్నాయి.