Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండకు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో మిగిలిన భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే దివ్య దర్శనానికి 6 గంటలు.. స్పెషల్ దర్శన్ టికెట్ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం సమయం తీసుకుంటుంది. ఇక శుక్రవారం 68,021 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ.3.63 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక 31,047 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు..
ఈ ఏడాది అధికమాసం ఉండటంతో సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం, సెప్టెంబరు 22న గరుడ వాహనం, సెప్టెంబరు 23న స్వర్ణరథం,. సెప్టెంబరు 25న రథోత్సవం, సెప్టెంబరు 26న చక్రస్నానం, ధ్వజావరోహణం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 19న గరుడవాహనం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం జరుగనున్నాయని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల కారణంగా వివిధ సేవలు రద్దు..
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్చించున్నట్లు చెప్పారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుంచి 26 వరకు.. అక్టోబరు 15 నుంచి 23వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే నిర్దేశిత వాహనసేవకు అనుమతిస్తారని తెలిపింది.
ఇది కూడా చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. ఇక భక్తులకు భయం లేదు