TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?

టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరన్న అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరించకపోతే మరో సీనియర్ ఐఏఎస్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?

తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా.. సభ్యులంతా ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో పేపర్ లీక్ లు కావడం, పరీక్షలు అనేక సార్లు వాయిదా పడడం, రద్దు కావడం తదితర పరిణామాల నేపథ్యంలో నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలు మళ్లీ తలెత్తకుండా.. లోపాలను సరి చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే చైర్మన్ కోసం వెతుకుతోంది రేవంత్ సర్కార్. ఈ రంగంలో అనుభవం కలిగిన వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తే బాగుంటుందన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Telangana: భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు..

అయితే.. విద్యారంగంలో విశేష అనుభవం కలిగిన ప్రొఫెసర్ కోదండరాం పేరును టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పరిశీలించారు. కానీ ఆయన సేవలను ప్రభుత్వంలో వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరు తెరపైకి వచ్చింది. నాటి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

నాటి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా నియామకాలపై కూడా ఆయన తరచుగా స్పందిస్తున్నారు. నిరుద్యోగులు నిర్వమించిన రౌండ్ టేబుల్ సమావేశంలో, ఇతర ఆందోళనల్లో పాల్గొన్నారు. ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆయనకు విద్యారంగంలో ఉన్న అనుభవాన్ని గుర్తించి విద్యా, మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమించింది. దీంతో నిజాయితీ కలిగిన అధికారిగా పేరున్న ఆకునూరి మురళిని కమిషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

ఒక వేళ ఆయన ఇందుకు ఆసక్తి చూపకపోతే.. సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలోనూ డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించారు. అయితే.. జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంత వరకు ఆమోదించలేదు. ఆయన రాజీనామా ఆమోదం తర్వాత కొత్త చైర్మన్ పేరును ప్రభుత్వం ఖరారు చేయనుంది.

Advertisment
తాజా కథనాలు