/rtv/media/media_files/2026/02/17/ilayaraja-2026-02-17-07-21-03.jpg)
Ilayaraja
Ilayaraja: ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంగీత సంస్థ సారేగమాకు(Saregama) చెందిన పాటలను ఉపయోగించకూడదని కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13న న్యాయమూర్తి తుషార్ రావు గెడెలా ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
సారేగమా వాదన ప్రకారం, 1976 నుంచి 2001 మధ్య అనేక చిత్రాల నిర్మాతలతో ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల ప్రకారం ఆ సినిమాల్లోని పాటల హక్కులు ప్రపంచవ్యాప్తంగా శాశ్వతంగా తమకే చెందుతాయని సంస్థ తెలిపింది. కానీ ఇటీవల ఇళయరాజా ఆ పాటలను తన పేరుతో అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేసి, ఇతరులకు లైసెన్స్ ఇస్తున్నారని సారేగమా కోర్టును ఆశ్రయించింది.
Ilayaraja Saregama Issue
ఇది సుమారు 134 సినిమాలకు చెందిన పాటలపై వర్తిస్తుంది. ఈ పాటలను ఇకపై ఉపయోగించకూడదని, లైసెన్స్ ఇవ్వకూడదని, మూడో వ్యక్తులకు హక్కులపై ఎలాంటి హామీలు ఇవ్వకూడదని కోర్టు స్పష్టం చేసింది. లేకపోతే సారేగమాకు తిరిగి సరిచేయలేని నష్టం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.
ఇళయరాజా, సారేగమా మధ్య ఇప్పటికే ‘ఎన్ ఇనియ పొన్ నీలవే’ అనే తమిళ పాటపై హక్కుల వివాదం నడుస్తోంది. ఆ కేసులో కూడా కోర్టు సారేగమా పక్షాన తీర్పు ఇచ్చింది.
కాపీరైట్ చట్టం 1957 ప్రకారం, సాధారణంగా సినిమా నిర్మాతకే మొదటి హక్కు ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత, ఈ దశలో సారేగమా హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇటీవల కొన్ని సినిమాల్లో తన పాటలను అనుమతి లేకుండా వాడుతున్నారని ఇళయరాజా కేసులు వేయగా, కొన్ని సందర్భాల్లో ఆయనకు అనుకూలంగా తీర్పులు కూడా వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పెద్ద షాక్గా మారాయి.
ఇప్పటికైనా ఇళయరాజా తరఫున అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ కాపీరైట్ పోరాటం ఇక ముందు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
Follow Us