/rtv/media/media_files/2026/03/06/anasuya-2026-03-06-15-25-10.jpg)
Anasuya
Anasuya: యాంకర్గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె ముక్కుసూటిగా మాట్లాడే తీరు వల్ల కొన్ని సందర్భాల్లో వివాదాలు కూడా వస్తుంటాయి. ఇటీవల హోలీ సందర్భంగా జరిగిన ఒక సంఘటన మళ్లీ ఆమెను వార్తల్లోకి తీసుకొచ్చింది. స్టేజ్పై అనసూయ మాట్లాడుతున్న సమయంలో కొందరు యువకులు “ఆంటీ… ఆంటీ…” అంటూ కేకలు వేయడంతో అనసూయ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియా ద్వారా గట్టిగా స్పందించారు.
అనసూయ తన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పే వ్యక్తి. ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చెప్పడంలో వెనక్కి తగ్గరని ఆమె ఇప్పటికే పలుమార్లు నిరూపించారు. తన గురించి, తన దుస్తుల గురించి అసభ్యంగా మాట్లాడితే లేదా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఆమె గట్టిగా స్పందిస్తారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా మందిని బ్లాక్ చేయించానని కూడా అప్పట్లో చెప్పారు.
హోలీ వేడుకల్లో అనసూయకు మైక్ పట్టుకోగానే "ఆంటీ ఆంటీ" అంటూ గోల..#Anusuyapic.twitter.com/9CYiEC2dAz
— Milagro Movies (@MilagroMovies) March 5, 2026
తనపై విమర్శలు వచ్చినా చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటానని అనసూయ చెప్పింది. కానీ తన వ్యక్తిత్వం లేదా తన కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం స్పందించాల్సి వస్తుందని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. కొందరు మహిళలు కూడా తన దుస్తులపై కామెంట్లు చేస్తుండటం తనకు బాధ కలిగిస్తుందని ఆమె అన్నారు. వాళ్లకు తన గురించి తెలియదు, తనకు వాళ్ల గురించి తెలియదు అయినా తనపై ఇలా మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/03/06/anasuya-2026-03-06-15-26-44.jpeg)
ఇటీవల హీరోయిన్ల దుస్తుల గురించి హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై కూడా అనసూయ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ తన అభిప్రాయం తెలిపారు. ఆ సమయంలో సినీ పరిశ్రమలో కూడా రెండు వర్గాలు ఏర్పడి కొందరు ఆమెకు మద్దతు ఇవ్వగా మరికొందరు విమర్శించారు. ఆ వివాదం తర్వాత కొంతకాలంగా అనసూయ నిశ్శబ్దంగా తన పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ మధ్య హోలీ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమానికి అనసూయ ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ స్టేజ్పై డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. తర్వాత మైక్ తీసుకుని మాట్లాడుతుండగా కొందరు యువకులు “ఆంటీ… ఆంటీ…” అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన ఆమెకు ఊహించని అనుభవంగా మారింది. అయినప్పటికీ ఆమె తనను తాను అదుపులో ఉంచుకుని స్పీచ్ పూర్తిచేశారు.
అయితే ఆ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఆ విషయంపై రీల్స్ చేసి షేర్ చేయడం ప్రారంభించారు. దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టి తన అభిప్రాయం వెల్లడించారు.
ఇతరుల బాధలో ఆనందం పొందడం మంచిది కాదని ఆమె చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఇతరుల పట్ల కనీస గౌరవం ఉండాలని అన్నారు. వయసును చూసి బాడీ షేమింగ్ చేయడం లేదా మహిళలను తక్కువగా మాట్లాడటం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సమాజం ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ “నాకేం సంబంధం లేదు” అని వదిలేస్తే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతాయని ఆమె తెలిపారు.
తాను ఎప్పుడూ నిజం అనిపించినదే మాట్లాడుతానని, ఎవరికీ భయపడనని అనసూయ చెప్పారు. చాలా అవమానాలు, కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. తన ప్రయాణం, తన సాధించిన విజయాలు తనకు గర్వంగా ఉంటాయని తెలిపారు. ఎంతో కష్టపడి ఎదుగుతున్న వారిని తక్కువగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆమె గట్టిగా హెచ్చరించారు.
ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన ఇక్కడితో ముగుస్తుందా లేదా మళ్లీ పెద్ద చర్చకు దారితీస్తుందా అనేది చూడాలి.
Follow Us