Akhanda 2: 'అఖండ 2'కు చుక్కలు చూపిస్తోన్న ఎరోస్ ప్రొడక్షన్ హౌస్.. వివాదానికి అసలు కారణం ఇదే!

దూకుడు విజయంతో మొదలైన 14 రీల్స్- ఎరోస్ సంబంధం, 1-నేనొక్కడినే, ఆగడు లాసులతో ఆర్థిక వివాదంగా మారింది. మహేష్ బాబు శ్రీమంతుడు ద్వారా సహాయం చేసినా, బకాయిలు పూర్తి కాలేదు. 2015-2019 ఒప్పందం కూడా ఫలించక వడ్డీ పెరిగింది. ఇప్పుడు అఖండ 2 విడుదలపై ఈ వివాదం మళ్లీ బయటకు వచ్చింది.

New Update
Akhanda 2

Akhanda 2

Akhanda 2: 'అఖండ 2' విడుదల వాయిదా పడడంతో, ఎరోస్ ఇంటర్నేషనల్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య చాలా ఏళ్లుగా సాగుతున్న ఆర్థిక వివాదం మళ్లీ బయటకు వచ్చింది. ఈ సమస్య ఇప్పుడు ఎందుకు బయటపడింది? దీనికి అసలు ప్రారంభం ఎప్పుడు ఎక్కడ మొదలైంది? అన్న విషయాలు తెలుసుకోవాలంటే గతంలో జరిగిన సంఘటనలను ఒకసారి మాట్లాడుకోవాలి.

'దూకుడు' విజయంతో మొదలైన రిలేషన్.. 

14 రీల్స్ నిర్మించిన మహేష్ బాబు చిత్రం దూకుడు భారీ హిట్ అయ్యింది. ఈ సినిమా విజయం 14 రీల్స్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఎరోస్, 14 రీల్స్ మధ్య వ్యాపార సంబంధం బలపడింది.

1-నేనొక్కడినే - మొదటి భారీ నష్టం

దూకుడు తర్వాత ఎరోస్, 14 రీల్స్‌తో కలిసి 1-నేనొక్కడినేకి ఫైనాన్స్ అందించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ నష్టం రావడంతో, 14 రీల్స్ ఎరోస్ కు పెద్ద మొత్తంలో బకాయిల్లో పడింది. ఈ నష్టాన్ని కొంత తగ్గించుకోవడానికి ఇద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్‌ చేశారు.

ఆగడు - మరో వైఫల్యం... దూకుడు కాంబినేషన్‌పై ఉన్న భారీ హైప్‌తో ఆగడును తీసుకొచ్చారు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో, 14 రీల్స్ ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది. ఎరోస్ కు  చెల్లించాల్సిన మొత్తాలు అలాగే పెరిగిపోయాయి.

మధ్యలో మహేష్ బాబు జోక్యం

పరిస్థితి ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకున్న మహేష్ బాబు, 14 రీల్స్‌కు సహాయం చేయాలని ముందుకొచ్చారు. ఎరోస్ కు తాను ఒక సినిమా ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ, శ్రీమంతుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఈరోస్‌కు ఇచ్చారు. శ్రీమంతుడు భారీ విజయమైంది, దీనితో ఎరోస్ కు కొంత వరకూ నష్టం భర్తీ అయ్యింది. కానీ అప్పులో కొంత భాగం ఇంకా మిగిలిపోయింది.

2015-2019 మధ్య ఒప్పందం 

మిగిలిన బకాయిని క్లియర్ చేసేందుకు, ఎరోస్, 14 రీల్స్ మధ్య 2015 నుంచి 2019 వరకు చెల్లింపు ఒప్పందం చేసుకున్నారు. ఎరోస్ నాలుగు సంవత్సరాలు వేచి చూసింది. కానీ మొత్తం అప్పు ఆ సమయానికి పూర్తిగా చెల్లించలేదు. ఒప్పందం ప్రకారం, 2019 జూలై నుంచి బకాయిపై ప్రతి ఏడాది 14% వడ్డీ వేయాలని నిర్ణయించారు. ఇలా ఈ వడ్డీ సంవత్సరాలుగా పెరుగుతూ, ఇప్పుడు చాలా పెద్ద మొత్తంగా మారింది.

సర్కారు వారి పాటలో ఎందుకు ఇబ్బంది పెట్టలేదు?

సర్కారు వారి పాట సమయంలో ఎరోస్ ఎలాంటి సమస్యలు సృష్టించలేదు. కారణం - ఆ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (మహేష్ బాబు సంస్థ) భాగస్వాములు ఉండటం. ఇంకా ముఖ్యంగా మహేష్ బాబు ఇప్పటికే 2015లో ఎరోస్ కు సహాయం చేసినందున, వారు ఆ ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు.

అఖండ 2 ఎందుకు టార్గెట్ అయ్యింది?

అఖండ 2 ఇప్పుడు భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో రావడం వల్ల, ఎరోస్ కు ఇది తమ పాత బకాయిని తిరిగి పొందడానికి మంచి అవకాశంగా కనిపిస్తోంది. అందుకే సినిమా విడుదలకు ముందే ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరువైపులా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమస్య త్వరగా పరిష్కారమైతే మాత్రమే అఖండ 2-తాండవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదల అయ్యే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు