Pawan Kalyan :
సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో హీరోగా మెప్పించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యారు. తాజాగా ఆయనకు సంబంధించి ఓ బాలీవుడ్ షోలో ప్రశ్న అడగడం విశేషం.
బాలీవుడ్ ఫేమస్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్బీ ఓ కంటెస్టెంట్ను పవన్కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు.
కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్లో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు. ఏదేమైనా 'కౌన్ బనేగా కరోడ్ పతి' లాంటి బిగ్గెస్ట్ షోలో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న రావడం ఆయన క్రేజ్ కు నిదర్శనం అని చెప్పొచ్చు.
కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ లో తన పార్టీ జనసేన నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో.. 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు.