హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. దాదాపు 52 రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు నాయిడు (Chandrababu Naidu) కొద్ది సేపటి క్రితం విడుదలయ్యారు. చంద్రబాబుకు అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో (Balakrishna) పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరినీ చేయనివ్వలేదని స్పష్టం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Shock to CBN: చంద్రబాబుకు సీఐడీ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు!
తన అరెస్ట్ ను ఖండించిన బీఆర్ఎస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్లపైకి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన అభిమానాన్ని తాను మరిచిపోలేనన్నారు. ప్రజల ప్రేమతో తన జీవితం ధన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు.
జైలుకు వచ్చి తనకు మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఆయన కుమారుడు నారా లోకేష్, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జైలు వద్దకు వెళ్లారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు విజయవాడకు బయల్దేరారు. నేడు లేదా రేపు అక్కడి నుంచి చంద్రబాబు హైదరాబాద్ నివాసానికి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.