Desi Shares:
ఒక్కరోజు నష్టాల నుంచి దేశీ మార్కెట్ కోలుకుంది. ప్రారంభం నుంచే మార్కెట్లో జోష్ కనిపించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మన మార్కెట్లు లాభాలపట్టాయి. ఉదయం ప్రారంభంలోనే మార్కెట్ చాలా హైలోకి వెళ్ళింది. దీంతో ఉదయమే సెన్సెక్స్ 83, 610, నిఫ్టీ 25, 568 మార్కు క్రాస్ చేశాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 236 పాయింట్లు లాభపడి 83, 184 దగ్గర ముగియగా.. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 25, 415 దగ్గర ముగిసింది. మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ.83.76 దగ్గర ముగిసింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా రాణించాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా లాభపడగా.. అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. ఇక నిఫ్టీలో ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, హెచ్యుఎల్ టాప్ గెయినర్స్గా ఉండగా… బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఒఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు పడిపోయాయి. సెక్టార్లలో రియల్టీ, బ్యాంక్, ఎఫ్ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు క్యాపిటల్ గూడ్స్, ఐటి, ఫార్మా, ఆయిల్ & గ్యాస్, మీడియా, మెటల్, టెలికాం, పవర్ 0.5-4 శాతం క్షీణించాయి.