BJP Chalo Hyderabad: బీఆర్ఎస్ పై బీజేపీ మలిదశ ఉద్యమం మొదలైందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో.. అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. ఇక కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, వడ్డీతో సహా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చేపడుతున్న దీక్షలపై బీఆర్ఎస్ దమనకాండ చేస్తోందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో బీజేపీ నేతలపై అణిచివేత కొనసాగుతోందని.. నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారన్నారు. దీంతో ఎంతో మంది నేతలకు గాయాలయ్యాయని..ఇది ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా అని.. కేసీఆర్ వి నయా నిజాం పోకడలని అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కేసీఆర్ డక్ అవుట్ అవ్వడం ఖాయం..!
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న కేసీఆర్ డక్ అవుట్ అవ్వడం ఖాయమని సొంత సర్వేలో తేలిందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అందుకే అసహనంతో పూర్తి విచక్షణ కోల్పోయి ప్రతిపక్షాలపై దాడులకు ఆయన పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే అభ్యర్థుల జాబితాలో టికెట్లు కూడా సిట్టింగులకే కేటాయించారన్నారు. దళిత బంధులో 30 శాతం కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.
సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్..!
కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలా పునీతులయ్యారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాలం చెల్లినట్లేనని.. బీఆర్ఎస్ ను రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమన్నారు ఆయన. ఇక దశలవారీగా ప్రకటించిన ఉద్యమంపై వెనుకడుగు వేయబోమన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన చలో హైదరాబాద్ పేరిట రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామన్నారు. రేపు మంత్రుల ఘెరావ్..ఎల్లుండి కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు.