Union Budget 2024: మరి కొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ పై అందరికీ ఎన్నో ఆశలు. టాక్స్ రిలాక్సేషన్ మిడిల్ క్లాస్ పీపుల్ అడుగుతున్నారు.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం టాక్స్ తగ్గించాలని కోరుతున్నారు.. కిసాన్ యోజన సహాయం పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇక ఇండస్ట్రీల కోరికలైతే చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా ఉపాధి కల్పనపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మూడ్. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర బడ్జెట్ పై చాలా ఆసక్తితో ఉన్నారు. ఆసక్తి అనేకంటే.. చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
Union Budget 2024: ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఓటర్లు కనీస ప్రతిపక్షం కూడా లేకుండా పూర్తిస్థాయిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమికి ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. బీజేపీకి చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారు తీసుకువచ్చే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రజల ఆశ.
Union Budget 2024: ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఏదైనా ప్రకటన ఉంటుందా అనేది చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని రెండూ తమ ప్రాధాన్య అంశాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇక రాజధాని అమరావతి నిర్మాణం వేగవంతం చేయడం కోసం ప్రత్యేకంగా నిధులు అందించే ప్రతిపాదన ఏదైనా బడ్జెట్ లో రావచ్చని ఆశిస్తున్నారు. ప్రధానంగా ఈ మూడు అంశాల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.
Union Budget 2024: ఇవి కాకుండా రాష్టంలో రహదారుల పరిస్థితి ఘోరంగా ఉంది. గత ఐదేళ్లుగా ఎటువంటి మరమ్మత్తులు లేకుండా రోడ్లన్నీ ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రంలోని రహదారుల కోసం బడ్జెట్ లో ఏదైనా ప్రకటన చేస్తారా అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఇదిలా ఉంటే.. విభజన సమయంలో రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలు పదేళ్లు దాటిపోయినా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వీటివిషంలో కూడా కేంద్ర బడ్జెట్ లో ఏదైనా సానుకూల ప్రకటన వెలువడితే బావుంటుంది అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Union Budget 2024: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంది. ఎందుకంటే, ఎన్డీయేలో బీజేపీ తరువాత అధిక ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ కూటమి నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కచ్చితంగా ఏపీ ప్రజల మనోభావాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఆ ఆశ నెరవేరేదీ.. లేనిదీ.. తేలిపోతుంది.
Also Read : 🔴 Union Budget 2024 LIVE: మోదీ 3.0 మొదటి బడ్జెట్.. వరాల జల్లులు ఉంటాయా?