Agri Gold Scam: ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా అగ్రిగోల్డ్.. 30 లక్షల మందిని ముంచిన ఈ స్కామ్ గురించి తెలుసా?

సీఐడీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ సంస్థ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలతో వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ ఈ రోజు అరెస్ట్ చేసింది. దీంతో 2014లో బయటపడ్డ అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారం ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

New Update
Agri Gold Scam: ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా అగ్రిగోల్డ్.. 30 లక్షల మందిని ముంచిన ఈ స్కామ్ గురించి తెలుసా?

సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలతో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. దీంతో అగ్రిగోల్డ్ వ్యవహారం మరోసారి ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ స్కామ్ ఏంటి? ఆ సంస్థ భూములను ప్రభుత్వం ఎందుకు జప్తు చేసింది? అన్న వివరాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ స్కామ్ గురించి సమగ్ర వివరాలు ఈ స్టోరీలో..

1995లో ఏర్పాటు..
అగ్రిగోల్డ్ సంస్థ 1995 ఏర్పాటైంది. అవ్వా వెంకటరామారావు ఆ సంస్థకు ఛైర్మన్. కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం అంటూ ఆశచూపి ప్రజల నుంచి భారీగా డిపాజిట్లను సేకరించింది ఈ సంస్థ. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ తెలంగాణ ప్రాంతంతో పాటు దేశంలోని మరో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రజల నుంచి సైతం భారీగా డిపాజిట్లు సేకరించింది. ఇందు కోసం భారీగా కమిషన్లు ఇస్తామని ఆశచూపి పెద్ద ఏజెంట్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది.

32 లక్షల మంది నుంచి డిపాజిట్లు..
తెలిసిన వారు ఏజెంట్లుగా ఉండడంతో నమ్మిన 32 లక్షల మంది ప్రజలు డిపాజిట్లు చేశారు. వీరి నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల పేరుతో సేకరించింది అగ్రిగోల్డ్. ఇందులో ఏపీలోనే 19.5 లక్షల మంది డిపాజిట్లు కట్టారని లెక్కలు చెబుతున్నాయి. సంస్థ ఇచ్చే బిల్డప్ నమ్మి కొద్దిపాటి మొత్తం నుంచి కోట్ల కొద్దీ రూపాయలను డిపాజిట్లు చేసిన వారు సైతం ఉన్నారు. కొంత మంది అయితే.. తాము జీవితకాలంలో సంపాధించిన మొత్తం డబ్బును కూడా అగ్రిగోల్డ్ లోనే డిపాజిట్ చేసుకున్నారు.

అయితే.. 2014 సమయంలో అగ్రిగోల్డ్ అసలు కథ బయటపడింది. చెప్పిన గడువు పూర్తయిన తర్వాత కూడా డిపాజిట్లను చెల్లించకపోవడం, వడ్డీలు అందించలేకపోవడం, చెక్కులు కూడా బౌన్స్ అవుతుండడంతో డిపాజిట్ దారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో ఏజెంట్లు, డిపాజిట్ దారులు సమావేశమయ్యారు. తాము మోసపోయామని గుర్తించిన కొందరు డిపాజిటర్లు 2014 డిసెంబర్లో పోలీసులను ఆశ్రయించారు. 2015 ప్రారంభమయ్యే నాటికి లక్షలాది మంది డిపాజిటర్లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జరగాల్సిందంతా జరిగిపోయాక.. సెబీ, ఆర్బీఐ పర్మిషన్ లేకుండానే అగ్రిగోల్డ్ ఈ వ్యవహారాన్నంతా నడిపినట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో కేసును సీఐడీకి ట్రాన్స్ఫర్ చేశారు. సీఐడీ 2016 సెప్టెంబర్లో సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా శేషు నారాయణరావును అరెస్ట్ చేసింది. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం.. అగ్రిగోల్డ్ సంస్థ 30 లక్షలకు పైగా డిపాజిట్ దారుల నుంచి సేకరించిన సొమ్ముతో దాదాపు ఏడు రాష్ట్రాల్లో 16 వేల ఎకరాల భూములను కొనుగోలు చేసింది. ఇంకా.. ఆ సంస్థకు పలు బ్యాంకుల్లో మొత్తం రూ.500 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

భూములు అటాచ్..
విచారణ చేపట్టిన సీఐడీ అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసింది. అనంతరం ఆ ఆస్తులను వేలం వేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సీఐడీ 2016 డిసెంబరు 27న ఆ ఆస్తులకు వేలం నిర్వహించింది. అయితే.. ఎవరూ ఆ భూములను కొనడానికి ముందుకురాలేదు. ఆ సమయంలో జరిగిన పెద్ద నోట్ల రద్దు ఇందుకు కారణమన్న చర్చ జరిగింది. అనంతరం అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను టేకోవర్ చేయడానికి జీఎస్సెల్ గ్రూప్‌ ఆసక్తి చూపింది. ఈ మేరకు కోర్టులో రూ. 10 కోట్లను సైతం సంస్థ డిపాజిట్ చేసింది. ఏమైందో తెలియదు కానీ.. అగ్రిగోల్డ్ ఆస్తులను టేకవర్ చేసేందుకు సంస్థ వెనకడుగు వేసింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని జీఎస్సెల్ గ్రూపు కోర్టుకు సమాచారం ఇచ్చింది.

ఇదిలా ఉంటే..ఈ స్కామ్ గురించి సమగ్ర విషయాలు తెసిన వ్యక్తిగా పేరున్న అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు గుండెపోటుతో చనిపోయారు. అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ సదాశివ వరప్రసాద్‌ 2019లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పార్కింగ్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.

రెండు దశలో డబ్బులు చెల్లించిన వైసీపీ సర్కార్:
2019 ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ వివాదం ప్రధానాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో రూ.929.75 కోట్లను చెల్లించారు. రూ.10వేలు లోపు డబ్బులు డిపాజిట్‌ చేసిన వారికి ఫస్ట్ ఫేజ్ లో, రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి సెకండ్ ఫేజ్ లో డబ్బులు చెల్లించింది ప్రభుత్వం. మొత్తం 10.37లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆ డబ్బు అందిందని నాటి జగన్ సర్కార్ వెల్లడించింది. మిగిలిన వారికి కూడా చెల్లించేందుకు తాము ప్రయత్నించామని.. కానీ న్యాయపరమైన, సాంకేతికరమైన చిక్కుల కారణంగానే పూర్తి చేయలేకపోయామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా పదేళ్లైనా అగ్రిగోల్డ్ బాధితులకు ఇంకా న్యాయం దక్కలేదు.

Advertisment
తాజా కథనాలు