Janagam District: స్కూల్ కు అని వెళ్లిన విద్యార్ధి రైలు పట్టాలపై శవమై తేలాడు. ఈ అనుమానాస్పద ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. కొడారి రాజ్ కుమార్ అనే విద్యార్ధి స్టేషన్ఘన్పూర్లోని సెయింట్ థామస్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు లానే రాజ్ ఉదయాన్నే పాఠశాలకు వెళ్ళాడు. కానీ కొంత సమయం తర్వాత రాజ్ కుమార్ స్కూల్ లో కనిపించకపోవడంతో స్కూల్ యాజమాన్యం అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాజ్ కుమార్ స్కూల్ నుంచి పారిపోయినట్లు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
రైలు పట్టాలపై రాజ్ కుమార్ మృతదేహం
పోలీసులు ఎంత వెతికిన రాజ్ కుమార్ జాడ కనిపించలేదు. ఆ తర్వాత కాసేపటికి చిల్పూర్ మండలం వంగాలపల్లి రైల్వే రైలు పట్టాలపై రాజ్ మృతదేహం ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఇటీవలే రాజ్కుమార్పై స్కూల్ లోని ఇతర విద్యార్థుల దాడి చేశారని.. అప్పటి నుంచి అతను మూడీగా ఉంటున్నాడని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో అతని మృతి పట్ల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యమే తమ కొడుకు చావుకు కారణమని ఆరోపిస్తున్నారు. మరో వైపు విద్యార్థి సంఘాలు.. ఫీజులు భారీగా తీసుకుని కనీస రక్షణ సౌకర్యలు కూడా లేవని యాజమాన్యం పై మండిపడుతున్నారు.