రికార్డు స్థాయిలో కొనుగోలు
జగిత్యాల జిల్లాలో ఎట్టకేలకు యాసంగి వరి ధాన్యం సేకరణ పూర్తి అయింది. ఈ సారి వడ్ల కొనుగోలు ఆలస్యమైనా వానలు కూడా ఆలస్యం కావటంతో చివరిదశలో పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. వానలు సకాలంలో వస్తేమాత్రం రైతుల ధాన్యం పెద్దఎత్తున తడిసి చెడిపోయేది. కాగా ధాన్యం విక్రయానికి చాలారోజులు పడిగాపులు పడిన రైతులు ప్రస్తుతం చెల్లింపులకు ఎదురు చూస్తున్నారు.
అధిక కొనుగోలు
జిల్లాలో 415 ప్యాక్స్, ఐకేపీ, మెప్మా కేంద్రాల ద్వారా యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయగా ప్రస్తుతం అన్ని కేంద్రాల్లో సేకరణ ముగిసింది. ఈ యాసంగిలో 2.98 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగుచేయగా అకాల వానలతో దాదాపుగా 35 వేల ఎకరాల్లోని వరిపైరు దెబ్బతిన్నది. మిగిలిన పంటలో విత్తన, సన్నధాన్యం, మార్కెట్యార్డులు, నేరుగా మిల్లుల్లో జరిపిన విక్రయాలు పోను 60 వేల 393 మంది రైతుల వద్దనుంచి రూ.842.45 కోట్ల విలువైన 4.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కాగా గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే తీసుకోగా ఈ యాసంగిలో 1.15 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశారు.
డబ్బుల చెల్లింపుల జాప్యంతో రైతుల ఇబ్బందులు
జిల్లాలో యాసంగి పంటకాలాల కొనుగోలును చూస్తే ఈ సీజన్లోని రూ.842.45 కోట్ల ధాన్యం సేకరణ రికార్డుగా నిలుస్తోంది. ప్రస్తుతం ధాన్యం డబ్బుల చెల్లింపుల జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు రూ.349.44 కోట్లను మాత్రమే రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లించారు. ధాన్యాన్ని విక్రయించిన తదుపరి 48 గంటల్లో చెల్లింపులు జరుపుతామని ప్రభుత్వం పేర్కొన్నా చాలామందికి 20 రోజులకుపైగా సమయం తీసుకుంటోంది. మరోవైపు రుతుపవనాల రాక ఆలస్యంకాగా ఇటు ధాన్యం డబ్బులు కూడా చేతికందక రైతులు వానాకాలం పెట్టుబడులు, సాగుపనులకు వెళ్లే పరిస్థితుల్లేవు. మార్క్ఫెడ్ సంస్థకు మొక్కజొన్నలను విక్రయించిన రైతులు కూడా చాలామంది డబ్బులకు ఎదురుచూస్తున్నారు. వెంటనే చెల్లింపులు పూర్తిచేయాలని రైతన్నలు కోరుతున్నారు.