బిపోర్జాయ్ తుఫాన్ కారణంగా స్తంభించిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల అవర్తనంతో రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి.
కూల్.. కూల్గా..
పది రోజుల క్రితమే నైరుతి రాయలసీమను తాకినా తుఫాన్ కారణంగా అవి ముందుకు కదల్లేదు. శ్రీహరికోట ప్రాంతంలోనే స్తంభించిపోయాయి. తుఫాన్ తీరం దాటడంతో ఆదివారం నుంచీ రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదలడం ప్రారంభించాయి. సోమవారం రాయలసీమ అంతటా విస్తరించాయి. దీంతో, నెల్లూరు, ప్రకాశం, కర్నూల్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి, పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం లభించింది.
తగ్గిన ఉష్ణోగ్రతలు
రుతుపవనాల ప్రభావంతో కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలాచోట్ల వాతావరణం చల్లబడింది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలన్నీ చల్లబడగా కోస్తా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గాయి. కృష్ణా, గుంటూరు బెల్ట్లోనే సోమవారం ఎండ తీవ్రత కనిపించింది.
గత పది రోజులుగా 600కిపైగా కేంద్రాల్లో 40 నుంచి 46 డిగ్రీలు వరకు నమోదైన ఉష్ణోగ్రతలు సోమవారం 120 కేంద్రాల్లోనే నమోదయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన మేఘాలు బలంగా కదులుతుండడంతో మంగళవారానికల్లా రాష్ట్రం మొత్తం చల్లబడి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.