అదంతా టైం వేస్ట్..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్రమంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై కాపు నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. పవన్ కళ్యాణ్ను వీధి రౌడీతో పోల్చారు. ఎమ్మెల్యేలను విమర్శించి టైం వేస్ట్ చేసుకోవద్దని హితవు పలికారు. అంతేకాదు వారాహి యాత్రలో పవన్ చేస్తున్న పలు వ్యాఖ్యలకు ముద్రగడ కౌంటర్ ఇచ్చారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసిన నేతలు రాజకీయంగా ఎదుగుతున్నారంటూ వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆయనకు ఓ లేఖ రాశారు. ఇందులో ముద్రగడ పలు విషయాల్ని ప్రస్తావించారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగలేదన్నారు. అలాగే యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదని, చంద్రబాబు వల్ల పోగొట్టుకూన్న రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్ధితి చంద్రబాబు ద్వారానే పవన్ కల్పించారన్నారు.
కాపులను మోసం చేశారు..
తనకంటే బలవంతుడైన పవన్ కళ్యాణ్ ఉద్యమం చేపట్టి కాపులకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. గతంలో జగ్గంపేట సభలో అప్పటి విపక్ష నేత జగన్ కాపులకు రిజర్వేషన్ కేంద్రం చేతుల్లో ఉందని చెప్పినప్పుడు తానేం చెప్పానో గుర్తుచేసుకోవాలని పవన్కు సూచించారు. కాపులకు రూ.20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నానని, బీసీల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ను, కాపుల నుంచి బొత్స సత్యనారాయణను సీఎం చేయమని అడిగినట్లు ముద్రగడ గుర్తుచేశారు.
పోటీ చేసి దమ్ముందా..?
మరోవైపు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన ఆరోపణల్ని కూడా తప్పుబట్టిన ముద్రగడ.. దమ్ముంటే ఆయనపై పోటీ చేసి గెలవాలని సూచించారు. తనను సీఎం చేయాలని పవన్ ఎలా అడుగుతారని కూడా ప్రశ్నించారు. రాష్ట్రంలో 175 సీట్లకు పోటీ చేస్తే సీఎం చేయాలని అడగాలి తప్ప .. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెబుతూ తనను సీఎం చేయమని ఎలా అడుగుతారన్నారు.