సైక్లోన్ బిపార్జోయ్ ముప్పు ముంచుకొస్తుంది. ఇవాళ గుజరాత్ తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ మధ్యాహ్నం తర్వాత గుజరాత్లోని కచ్ తీరాన్ని తాకనుంది. ల్యాండ్ ఫాల్ అయ్యే సమయంలో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే సమయంలో గుజరాత్ సర్కార్ 74 వేల మందికి పైగా ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించింది. గుజరాత్లోని 8 జిల్లాల్లో ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్గార్డ్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్లను మోహరించారు. అదే సమయంలో, NDRF 42 బృందాలను వివిధ రాష్ట్రాల్లో మోహరించారు. ఈ తుఫానుకు సంబంధించి PMO కూడా చాలా చురుకుగా ఉంది. ప్రతి క్షణం అప్డేట్ను స్వయంగా ప్రధాని మోదీ తెలుసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గాంధీనగర్ వరకు అన్ని ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నాయి.
ఈరోజు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం:
బిపార్జోయ్ తపాను కారణంగా రానున్న నాలుగైదు రోజుల పాటు బలమైన గాలులు తూర్పు దిశగా కదులుతాయని IMD హెచ్చరిక జారీ చేసింది. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేసింది. దీని కారణంగా, ఢిల్లీతో సహా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు, బుధవారం సాయంత్రం ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణంలో మార్పు కనిపించింది. బలమైన గాలుల కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదైంది. దీంతో పాటు గురువారం ఉదయం కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. బైపర్జాయ్ ప్రభావంతో ఢిల్లీలో నేడు, గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ వెదర్ పేర్కొంది.
రాజస్థాన్లోనూ హెచ్చరిక జారీ:
రాజస్థాన్లో బిపార్జోయ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ శాఖ పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే సమయంలో, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఆయా రాష్ట్రాల్లో బలమైన వేడి గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.