తెలంగాణలో ఇంకో ఐదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. పార్టీలు ప్రజలను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. బీజేపీకి ఛాన్స్ లేదని కాంగ్రెస్ చెబుతోంది. ఈసారి కచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉంది. ఇటు హ్యాట్రిక్ పక్కా అని అధికారపార్టీ చెబుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూదొందే అంటూ తెలంగాణలో కాషాయ పార్టీ ఎగురవేస్తామని బీజేపీ అంటోంది. ఈక్రమంలోనే పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది.
ఇటు ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలుసుకునేందుకు సైలెంట్ సర్వేలు చేస్తున్నాయి పార్టీలు. నేతలు ఎవరికి వారు తమకు సర్వేలు అనుకూలంగా ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. ఇటీవల మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పీసీసీ సర్వే చేసిందని దాని ప్రకారం బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధిస్తాయని మిగిలిన 15 సీట్లులలో తీవ్రమైన పోటీ ఉంటుందని వెల్లడించారు.
పీసీసీ సర్వేపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న సర్వే ఫలితాలను ప్రజలు నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలవబోయే ఆ సీట్లు ఏవో కూడా క్లారిటీ ఇవ్వాలని.. అప్పుడే ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉందన్నారు. లేదంటే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో వచ్చిన ఫలితాల దృష్ట్యా ఈ సర్వే అసమంజసమైనదిగా ప్రజలు అనుకునే అవకాకాశం ఉందని సెటైర్లు వేశారు.