ఎవరెక్కడపోతే నాకేంటి…నేను.. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలనుకునే ఈరోజుల్లో.. నిద్రాహారాలు మానేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. దేశ రాజధాని దిల్లీకి చెందిన కిరణ్వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలందరికి అవగాహన కల్పించడానికి.. దేశవ్యాప్తంగా 21 వేల కి.మీ.ల పాదయాత్ర చేపట్టారు. కేరళ రాష్ట్రంలో 2021 డిసెంబరు 28న పాదయాత్రను ప్రారంభించి.. ఇప్పటిదాకా 176 జిల్లాల మీదుగా 13,400 కిలోమీటర్లు నడిచారు. 2025 డిసెంబరు 31 నాటికి తన లక్ష్యం పూర్తి చేయాలన్నదే నా సంకల్పం అని కిరణ్ తెలిపారు. రక్తం కొరతతో దేశంలో రోజుకు 12 వేల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని కిరణ్ వర్మ తెలిపారు.
ఇప్పటి వరకు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా 12 రాష్ట్రాల్లో తన యాత్ర పూర్తయినట్లు తెలిపారు. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోని శిలిగుడిలో తన యాత్ర కొనసాగుతోంది. స్థానికంగా దొరికిన ఆహారం తింటూ.. కొన్నిసార్లు శ్మశానాల్లోనూ విశ్రాంతి తీసుకొంటూ తన యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఏదేమైనా తనను తారీఫ్ చేయాల్సిందే కదా… రక్తదానంపై అవగాహన కల్పించడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటూ ప్రజలకు అవగాహన కల్పించాలనే తన నిర్ణయం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.