తెలంగాణలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార, విపక్ష నేతల ప్రచారాలతో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నడుమ తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార జోరు పెంచేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. రెండో అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయగా.. కేవలం ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితాను ఈ రోజు ప్రకటించింది. త్వరలోనే పూర్తి జాబితాను విడుదల చేయనుంది.
మరోవైపు హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనుండగా.. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చిన కమలం పార్టీ.. ముగ్గురు ఎంపీలను పోటీలోకి దింపింది. ఇక బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలకు 10 స్థానాలు కేటాయించింది. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ బీజేపీ ఇంఛార్జి ప్రకాశ్ జవదేకర్ అసెంబ్లీ ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం తమ వద్ద బలమైన అస్త్రాలున్నాయని అన్నారు.
అయితే.. ఆ అస్త్రం ఏంటనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అయితే.. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని వారు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఈటల రాజేందర్ ను అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ప్రస్తుతం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ అన్ని పార్టీల్లోనూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామంటే తమకు బెనిఫిట్ అవుతుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇది కాకపోతే.. ఎస్సీ/ఎస్టీలను సీఎంగా చేస్తామని కూడా బీజేపీ ప్రకటించే అవకాశం కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల మహిళా బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ అదే ఊపులో మహిళను సీఎంగా చేస్తామని చెప్పే ఛాన్స్ కూడా ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. అమిత్ షా లేదా నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షా నేడు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలోనే ఆయన ఈ ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది.