తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న హస్తం పార్టీ ప్రచారంపై ఫోకస్ పెంచింది. ఇందుకోసం అగ్రనేతలను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు రోజుల్లో మల్లిఖార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ లాంటి నేతలతో మీటింగ్ లు పెట్టిన కాంగ్రెస్.. రేపు ప్రియాంక గాంధీని రాష్ట్రానికి రప్పిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొల్లాపూర్ లో ఆమె పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రియాంక దేవరకద్రకు చేరుకుంటారు. అక్కడ మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. టీపీసీసీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వారికి వివరిస్తారు. తార్వాత 4.30 గంటలకు కొల్లాపూర్ లో నిర్వహించనున్న ప్రజా భేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రియాంక పర్యటనను విజయవంతం చేయడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేయడంపై దృష్టి సారించారు.
TS Elections 2023: కేసీఆర్ నైజం అదే.. మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు
ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం, అవసరం తీరాక మోసం చేయడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ బస్సు యాత్రలో ఆదివారం నాడు ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, మెదక్లలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ సోనియాగాంధీకి మాట ఇచ్చి తప్పిన విషయం మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసని.. కానీ సోనియాగాంధీ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం ఇందిరమ్మకు సొంతం అని ఖర్గే అన్నారు. సంగారెడ్డిలో ఇందిరా గాంధీ కాలు మోపి యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారన్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచి దేశానికి ఆమె ప్రధానమంత్రి అయ్యారన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల కోసం చేసిన పని దేశంలో మరెవరూ చేయలేరన్నారు. కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్లో ఎన్నో జాతీయ సంస్థలు నెలకొల్పిందని, వాటితో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని మల్లికార్జున ఖర్గే అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చిందని, ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 బోనస్ ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Telangana: ‘అన్నా ఇటు వచ్చేయ్’.. నాగం జనార్థన్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు..
తెలంగాణకి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని ఖర్గే అన్నారు. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు, సాగు నీళ్లు… ఇలా ఏ హామీనీ సీఎం కేసీఆర్ నేరవేర్చలేదని ఖర్గే విమర్శించారు. పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫైవ్ గ్యారంటీస్ అమలవుతున్నాయని, తెలంగాణ ప్రజలను మధ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు అనుమానాలు రేకెత్తిస్తున్నారని, సందేహాలుంటే వచ్చి చూసుకోవచ్చని, ప్రజలను అడిగి తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పి లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తామని, స్వయంగా ఆయనే దగ్గరుండి కర్ణాటకలో అమలవుతున్న ఫైవ్ గ్యారంటీస్పై లబ్ధిదారులతో మాట్లాడిస్తారని ఖర్గే స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే..
బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్గా ఉన్నదంటున్నారు.. కానీ ఆ రెండూ కలిసే పనిచేస్తున్నాయన్నారు. మోడీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లుగానే కేసీఆర్ కూడా గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ధ్వజమెత్తారు. మోడీ, అమిత్ షా, కేసీఆర్ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
డీకే సవాల్కు బీఆర్ఎస్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే సోనియా మరోసారి పూనుకొని ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని కిరాయి మనుషులతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. సీఎం కేసీఆర్ కు తాను సూటిగా సవాల్ విసురుతున్నానని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. డీకే శివ కుమార్ సవాల్ విసిరితే కేటీఆర్ తోక ముడిచారని విమర్శించారు. కర్ణాటకకు వెళ్లడానికి బస్సు రెడీగా ఉందని, ప్రగతి భవన్ కు రావాలో, ఫామ్ హౌజ్ కు రావాలో కేసీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజీ గుండా పోతూ బీఆర్ఎస్ కట్టిన నాణ్యతలేని ప్రాజెక్ట్ చూద్దామన్నారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తాకి కూలిందన్నట్లు మేడిగడ్డ పరిస్థితి ఉందని రేవంత్ విమర్శలు చేశారు. వీళ్లను జైలో వేసి చిప్ప కూడు తినిపించాలన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
కాంగ్రెస్ బస్సు యాత్ర తాత్కాలిక వాయిదా
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయభేరి బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. నేడు భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ యాత్రను వాయిదా వేస్తున్నట్టు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని తరువాత తెలియజేస్తామని వివరించారు. అయితే, అనివార్యకారణాల వల్లనే యాత్ర వాయిదా వేసినట్లు చెబుతున్నప్పటికీ.. టికెట్ రాని నాయకులు తీవ్రంగా స్పందిస్తుండడం, కొందరు పార్టీని వీడడం, రాజీనామాలు చేస్తుండడంతో ముందు వాటిని నిలువరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా సోమవారం యాత్రలో పాల్గొనాల్సిన ముఖ్యఅతిథి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Telangana Elections 2023: ఎవడైనా సరే కొనేద్దాం.. ఈ ఎన్నికల్లో రేట్లు ఎంతో తెలుసా?
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు హాట్హాట్గా మారాయి. ఈసారి ఎలాగైనా విజయం సాధించేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఏం చేసైనా సరే విజయం సాధించుకురావాలని అభ్యర్థులకు టార్గెట్లు విధించాయి. అవసరమైతే ఆర్థికంగా అండదండలు అందించేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే ఎన్నికలు వచ్చాయంటే డబ్బు లేకుండా ఏ పనీ జరగదన్న సంగతి తెలిసిందే. నామినేషన్లు వేసి ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ ముగిసేంత వరకు కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇప్పటివరకు టికెట్ల కోసం నానా తంటాలు పడ్డ ఆయా పార్టీల అభ్యర్థులు ఇక ముందు చేయాల్సిన వాటిపై ఇప్పటినుంచే దృష్టిసారించారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఇతర పార్టీలకు చెందిన మండల స్థాయి నుంచి గ్రామస్థాయి నేతల వరకూ చోటామోటా నేతలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా?
ఒక్కో నేతకు ఒక్కో రేటు..
ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే 80 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే బీజేపీ కూడా సగం మంది అభ్యర్థులను ప్రకటించింది. సీటు దక్కిన నేతల్లో కొందరు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా మరికొందరు రేపటి నుంచి పర్యటనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని ముఖ్య నేతలు ఎవరు? వారు ఏ పార్టీల్లో ఉన్నారు..? అన్నది ఆరా తీస్తున్నారు. దీంతో పాటు గ్రామాల వారీగా బలమైన నేతలు, సర్పంచ్లు, ఎంపీటీసీల లిస్టును తయారుచేస్తున్నారు. వారిలో వీలైనంత మందిని తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైతే కండువా కప్పి పార్టీలోకి చేర్చుకోవడం.. లేదంటే తమ పరిధిలోని ఓట్లను వేయించేలా విశ్వసనీయ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మండల స్థాయి నేతలైతే రూ.20 నుంచి రూ. 50 లక్షల వరకు బేరాలు చేస్తున్నారు. ఇక గ్రామస్థాయి నేతలకు రూ.5 నుంచి 10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గత పదిరోజులుగా పలు జిల్లాల్లో ముందే అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న నాయకులు ఇలాంటి చేరికలను భారీ ఎత్తున జరిపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: TDP: చంద్రబాబు అరెస్ట్తో టీడీపీలో నాయకత్వ సంక్షోభం!
కుల, కార్మిక సంఘాలతో చర్చలు..
రాష్ట్రంలోని పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో కుల సంఘాలు, కార్మిక సంఘాలు కీలకపాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. పలు విషయాలపై వీరంతా ఉమ్మడిగా సమావేశమై తమ సమస్యలు పరిష్కరించమంటూ నేతలకు వినతులు సమర్పించిన సంఘటనలూ కోకొల్లలు. వీరంతా తమ నాయకుల మాటలను తూచ తప్పకుండా పాటిస్తారు. తేడా వస్తే వ్యతిరేకంగా పనిచేయడంలోనూ ముందుంటారు. ఈ నేపథ్యంలో పార్టీల అభ్యర్థులు తమ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కుల సంఘాల నేతలను తమ వైపు తిప్పకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా సంఘాలను నేరుగా కలవడమో, లేదా రహస్య ప్రదేశాల్లో కలిసి మంతనాలు జరుపుతున్నారు. నియోజకవర్గంలో ఆయా కులాల బలాలను బట్టి బేరసారాలు జరుపుతున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న కులాలకు భారీ మొత్తంలో నజరానాలు సమర్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని తమకు మద్దతుగా మలుచుకుంటున్నారు. రూ.1 లక్ష నుంచి ఓట్లను బట్టి రూ.50 లక్షల దాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
భంగపడ్డ నేతలకు భారీగా లబ్ధి
ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆయా నియోజకవర్గాల్లో చాలా మంది అభ్యర్థులు టికెట్లు ఆశించిన సంగతి తెలిసిందే. ఒక్కోచోట దాదాపు 5 నుంచి 10 మంది దాకా సీటు కోసం ప్రయత్నాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీటు రాని కొందరు సైలెంట్గా ఉంటే మరికొందరు మాత్రం వేరే పార్టీలు ఇచ్చే హామీలను బట్టి ఆయా పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సీటు రాక భంగపడ్డ నేతలను తమవైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీల జిల్లా స్థాయి నేతలు, కుదరకుంటే రాష్ట్రస్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నారు. గెలిస్తే నామినెటెడ్ పదవులిప్పిస్తామని హామీలిస్తున్నారు. అది కుదరకుంటే స్థలాలు, భూములు, భారీగా నగదు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్థాయిని బట్టి కోట్లలో బేరాలు జరుగుతున్నట్లు సమాచారం. అంత పెద్దగా ప్రాధాన్యత లేని నేతలకైతే రూ.1 కోటి వరకు బేరమాడుతున్నట్లు తెలిసింది. అలాగే పోటాపోటీ స్థానాలు.. బలమైన అభ్యర్థులున్న చోట్ల మాత్రం భారీ స్థాయిలో (రూ. 1 కోటి నుంచి 10 కోట్లు) నజరానాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
CM KCR: తుంగతుర్తిలో కేసీఆర్ సంచలన హామీ
24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మేము తాము అక్కడ రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెబుతున్నాడని సీఎం కేసీఆర్ (CM KCR) ఫైర్ అయ్యారు. అంతకన్నా దిగజారుడు ఉంటదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నమ్మి ఓటేస్తే గ్యారెంటీగా కాంగ్రెస్ (Congress) కరెంటును ఖతం చేస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే.. తెలంగాణ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తదన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇది కూడా చదవండి: KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్
తుంగతుర్తిలో గాదరి కిశోర్ కుమార్ ను మరో సారి లక్ష మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గం అంతా దళితబంధు పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని అంటున్నారని.. అదే జరిగితే రైతు బంధు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా.. ఏ పార్టీ కూడా ఈ ప్రాంతంపై కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తుంగతుర్తి ప్రాంతం గతంలో కరువుకు గురైందన్నారు.
ఇది కూడా చదవండి: CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం…పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ
– కోదాడ సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ #KCROnceAgain #VoteForCar pic.twitter.com/8eHlWJmG5w
— BRS Party (@BRSparty) October 29, 2023
నేడు ఇక్కడి చెరువులన్నీ నీళ్లతో నిండుకున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే ఇందుకు కారణమన్నారు. తుంగతుర్తిని చూస్తే తనకు నేడు తృప్తిగా ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు నీళ్లు కూడా ఇక్కడికి తెస్తామన్నారు. రైతు బంధు ఇచ్చి.. ప్రజలు కట్టిన ట్యాక్స్ ను వేస్ట్ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడని ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతదని అంటున్నాడని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ కావాలా?, 3 గంటల కరెంట్ కావాలా? అన్నది ప్రజలు తేల్చుకోవాలని కేసీఆర్ కోరారు.
TS Politics 2023: మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి షాక్.. బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చలమల కృష్ణారెడ్డి (Chalamala Krishna Reddy) బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చలమల కృష్ణారెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయన టికెట్ కు బ్రేక్ పడింది. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ కావడంతో చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. రాజగోపాల్ రెడ్డి మరో చోట పోటీ చేసి.. మునుగోడు తనకు వదిలి పెట్టాలని కోరారు.
ఇది కూడా చదవండి: TS Elections 2023: కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఎం కటీఫ్.. కారణమిదే?
కానీ.. హైకమాండ్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో పార్టీ వీడాలని చలమల డిసైడ్ అయ్యారు. ఇదే అదనుగా బీజేపీ చలమలను పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చిన రాజగోపాల్ రెడ్డిపై చలమల కృష్ణారెడ్డిని బరిలోకి దించి ఓడించాలన్న వ్యూహంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
మరో వైపు నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత పాల్వాయి స్రవంతి కూడా హైకమాండ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీని నాశనం చేయాలన్న లక్ష్యంతో బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మళ్లీ ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరో కీలక నేత కైలాష్ కూడా ఆమెతో కలిసి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేతలంతా రాజగోపాల్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేసే అవకాశం ఉంది.
Big Breaking: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా!
తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నాగంను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయమే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడి.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తాజా నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగడం కాంగ్రెస్ నేతలను కలవరానికి గురి చేస్తోంది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చారు.
ఇది కూడా చదవండి: TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. ఫామ్హౌస్లో వివేక్, రేవంత్ రెడ్డి చర్చలు?
దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగంతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.