Saria WaterFalls: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని శివారు ప్రాంతంలో ఉన్న జీనబాడు పంచాయతీలో ఉన్న సరియా జలపాతానికి విశాఖపట్నం, అనకాపల్లితోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు నిత్యం తరలివస్తుంటారు.
జలపాతం సమీపంలోని మూడు ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరానికి చెందిన 8 మంది శనివారం సరియా జలపాతం అందాలను చూసేందుకు వచ్చారు.. ఒకరు జలపాతంలో గల్లంతవ్వడంతో అతడిని రక్షించేందుకు ఇద్దరు నేవీ ఉద్యోగులు ప్రయత్నించారు.
ఆ నేవీ అధికారుల్లో ఒకరు గల్లంతయ్యారు. సరియ జలపాతంలో వెంకటసాయి(28), నేవీ ఉద్యోగి దిలీప్కుమార్(30)లు నీటిలో కొట్టుకుపోయినట్లు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం సరియా జలపాతం సందర్శనకు వచ్చిన వెంకట సాయి కాలుజారి జలపాతంలో పడిపోగా.. అతని రక్షించేందుకు నీటిలోకి దిగిన దిలీప్కుమార్ కూడా నీటిలో కొట్టుకుపోయారు.
వెంకటసాయి విజయనగరం జిల్లాలోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. వారిద్దరి ఆచూకీ కోసం అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించినప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు. వెంకటసాయి మృతదేహం కొద్ది దూరంలో దొరకగా..దిలీప్ మృతదేహం కోసం గాలింపుచర్యలు చేపట్టారు.