Crime: అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతానికి వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కోసం కొందరిని కిమ్స్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. ఆసుపత్రిలో బాధితులను ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మనుబోలు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో వినాయక చవితి ఉత్సవంలో అపశృతి జరిగింది .బాణాసంచా కాల్చుతుండగా ప్రమాదవశాత్తు టపాసులు పేలి సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి.మనుబోలు బీసీ కాలనీలోని వరసిద్ధి వినాయక ఆలయం వద్ద విగ్రహాన్ని ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం చేసేందుకు సిద్ధమయ్యారు. సమీపంలోని ఓ ఇంటి ప్రహరీ గోడ పక్కన టపాసులు నిల్వ ఉంచారు.
ఈ క్రమంలో టపాసులు కాలుస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న టపాసులపై నిప్పురవ్వలు పడటంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కు తరలించారు.
Also Read: గ్రాండ్ గా హీరో సిద్దార్థ్- అదితిపెళ్లి.. ఫొటోలు వైరల్!