బోనాల పండగ(Bonalu Festival) అంటే.. అమ్మవారికి బోనం సమర్పించడం, ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని కోరుకోవడం, ఇలా భక్తి పారవశ్యం నిండిన హృదయంతో భక్తులు అమ్మవారి గుడికి వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం.. ఇదే అదునుగా పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం వెళ్తుంటారు. కానీ.. బోనాల పండుగ రోజు పగలు ప్రతీకారాలతో భాగ్యనగరం భగ్గుమంది. జూబ్లీహిల్స్, తార్నాక, పాతబస్తీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆ ప్రాంతాలన్ని భయానకంగా మారాయి. అనేకమందికి గాయాలయ్యాయి. కొన్నిచోట్ల కత్తులతో మరికొన్ని ప్రదేశాల్లో కర్రలతో దాడులు చేసుకున్నారు.
57 మందిపై 307 అట్టెంప్ట్ మర్డర్ కింద కేసులు నమోదు..
ఇక నగరంలోని తార్నాక, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడతో పాటు పాతబస్తీలో జరిగిన దాడుల్లో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. బోనాల వేడుకల సందర్భంగా ముందస్తుగా మద్యం షాపులు మూసివేసిన గొడవలు తగ్గకపోగా.. ఈ ఏడాది మరింతగా గొడవలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతోనే బోనాల వేడుక సందర్భంగా ఈ ఘర్షణలు జరిగినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 57 మందిపై 307 అట్టెంప్ట్ మర్డర్ కింద కేసులు నమోదు చేయడంతో నిందితులందరు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. 57మందిపై మర్డర్ కేసు నమోదు చేయడంతో వీరికి ఇప్పట్లో బెయిల్ వచ్చే ఛాన్సులు తక్కువనే చెప్పాలి. దీంతో వీరంతా ఓ రెండు నెలలపాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వారిపై పోలీసుల ప్రత్యేక నిఘా..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి ఏడాది బోనాల సందర్భంగా అక్కడక్కడ కొన్ని ఘటనలు చోటుచేసుకుంటాయి. కానీ ఎప్పుడు లేనివిధంగా ఈసారి రికార్డ్ స్థాయిలో 307 సెక్షన్ కింద చాలా కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. వీరందరు ఒకవేళ బెయిల్పై విడుదలై బయటికి వచ్చిన వీరి కదలికలపై మాత్రం పోలీసులు డేగ కళ్లతో నిందితులపై నిఘా వేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. అవసరం అయితే ఎన్నికల సమయంలో వీరందరిని బైండోవర్ చేస్తామని పోలీస్ బాసులు చెబుతున్నారు.