Telangana government: తెలంగాణ సర్కార్ ఎన్నికల వేళ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. ఈ క్రమంలో అన్నదాతలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. బ్యాంకు ఖాతాలు స్తంభించిన రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
దీంతో స్తంభించిపోయిన రైతుల ఖాతాలకు నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందన్నారు ఆయన. ఇక నిర్దేశిత సమయానికే రైతు రుణమాఫీ పూర్తి అవుతుందన్నారు. ఇప్పటి వరకు 16.6 లక్షల ఖాతాలకు 8089.7 కోట్లు బదిలీ చేశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అయితే రుణమాఫీ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
రుణమాఫీ పై తప్పుడు ప్రచారం..!
బ్యాంకు ఖాతాలు ఏ కారణంతోనైనా క్లోజ్ అయినా..ఖాతా నెంబర్ మారినా, డీబీటీ ఫెయిల్ అయినా.. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి అన్నారు. ఇక రుణమాఫీ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. 2018 డిసెంబర్ 11 నాటికి ప్రతి కుటుంబానికి లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ పైన ఎంత వరకు రుణాలు ఉన్నా.. ఆయా రైతు కుటుంబాలకు రుణమాపీ ప్రక్రియ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.అయితే రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల డాటాబేస్ 2020 లో తయారు చేసిందని.. బ్యాంకు విలీనంతో రైతుల ఖాతాల విషయంలో గందరగోళం ఏర్పడిందన్నారు.