Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హస్తినకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. పలువురి చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్ అంశాలతో పాటు ఈ నెల 26న చేవెళ్లలో జరగబోయే ప్రజాగర్జన సభపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
కాగా, చేవెళ్ల సభలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను వెల్లడించనుంది. ఇప్పటికే ఈ సభ రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ నెల 26 న అట్టహాసంగా భారీ జనసందోహం మధ్య ఈ భారీ బహిరంగ సభను ఖమ్మం సభలా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించుకుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రానున్నారు. ఆయన చేతుల మీదుగానే ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు.
చేరికలపై ఖర్గేతో చర్చ..!
అయితే ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ రానున్న నెల రోజుల్లో కూడా మరిన్ని డిక్లరేషన్లతో ప్రజల మధ్య లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 29 న వరంగల్ లో మైనారిటీ డిక్లరేషన్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తరువాత మహిళా డిక్లరేషన్ ను కూడా విడుదల చేయాలని.. అయితే దాన్ని ప్రియాంక గాంధీ చేతల మీదుగా చేయించాలని టీపీసీసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చేరికలపై కూడా ఈ భేటీలో మల్లికార్జున ఖర్గేతో నేతలు చర్చించనున్నారు.