వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయాన్ని సోమవారం రోజా తన భర్త సెల్వమణితో కలిసి సందర్శించారు. వరుషాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారు రోజా సెల్పీలు తీసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా రోజా ప్రవర్తన సరిగా లేదంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
సాధారణ భక్తులకు, పూజారులకు నవ్వుతూ పక్కన నిల్చొని సెల్ఫీలు ఇచ్చిన రోజా.. పారిశుధ్య కార్మికులు దగ్గరకు వస్తుండగా మాత్రం రావొద్దు అన్నట్లుగా సైగలు చేశారు. దీంతో వారు దూరంగా నిల్చొని ఫొటోలు తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రిగా పని చేసిన రోజా ఇలా చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. రోజా మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంపై రియాక్ట్ కాలేదు.
ఇంకా రోజా విషయానికి వస్తే.. 2014, 19 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా సైతం పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత రోజా పెద్దగా బయటకు రావడం లేదు. గతంలోలాగా మీడియాలోనూ యాక్టీవ్ గా కనిపించడం లేదు. ఇటీవల జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మాత్రం ఆమె హాజరయ్యారు.