Nagababu: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట అని జనసేన నాయకుడు నాగబాబు ఆరోపించారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు విని అధికారులు తప్పులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తప్పు చేసే ప్రతి అధికారి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తే... జగన్ మాత్రం ధనమో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్ముతారని విమర్శించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అధికారులకు ఆరు నెలలు సమయం ఇస్తున్నామని.. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఆంధ్ర రాష్ట్రం అథోగతి పాలైందని.. మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారని మండిపడ్డారు.
టీడీపీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలి..
జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తేనే జగన్ దౌర్జన్య పాలనకు అంతం పలుకుతామని పేర్కొ్న్నారు. ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. పొత్తు ధర్మం విస్మరించి ఎవరూ ఎక్కడా మాట్లాడొద్దని.. పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం కార్యకర్తల బాధ్యత అని తెలిపారు. ఇంకొన్ని రోజులు క్రమశిక్షణగా ఉంటే పదేళ్ల మన నిరీక్షణకు తెరపడుతుందన్నారు. వచ్చేది ముమ్మాటికి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమేనని.. కష్టపడి, నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని నాగబాబు హామీ ఇచ్చారు.
వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే..
రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములే కాకుండా దేవుడి భూములను సైతం వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదేమిటని ఎదురిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. సంక్షేమ పథకాల ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారం తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేశారు. మరోసారి కానీ వైసీపీకి అధికారం ఇస్తే ఇంటి పత్రాలను కూడా బలవంతంగా లాక్కొని మరి తాకట్టు పెడతారని నాగబాబు వెల్లడించారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి జనసేన, టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన ఎగ్ ఫ్రైడ్ రైస్.. అసలేం జరిగిందంటే..?