Rajnikanth: త్వరలోనే భారత్ వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచకప్ మెగా టోర్నీ కోసం ప్రపంచమంతా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కు ఈ టికెట్లను అందజేయగా.. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్కు గోల్డెన్ టికెట్ అందజేసింది. బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా రజినీకాంత్కు ఈ టికెట్ను అందించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
“చరిష్మా, సినిమాకు సరైన నిర్వచనమైన నటుడు రజనీకాంత్కు బీసీసీఐ సెక్రటరీ జైషా గోల్డెన్ టికెట్ అందించారు. దిగ్గజ నటుడు.. భాష మరియు సంస్కృతికి అతీతంగా లక్షలాది మంది హృదయాల్లో చెదరని ముద్ర వేశారు. తలైవాను వన్డే ప్రపంచకప్కు విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మెగా టోర్నీకి ఆయన హాజరవుతారని, క్రికెట్ అభిమానులను మరింత అలరిస్తారని ఆశిస్తున్నాం”అని ట్వీట్ చేసింది. గోల్డెన్ టికెట్ ద్వారా ప్రపంచకప్లోని అన్ని మ్యాచులను వీఐపీ స్టాండ్ నుంచి ఉచితంగా చూసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, రజినీకాంత్లు మాత్రమే గోల్డెన్ టికెట్లు అందుకున్న వారిలో ఉన్నారు. త్వరలోనే మరికొంత మందికి బీసీసీఐ గోల్డెన్ టికెట్ను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ప్రపంచకప్ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచును ఆస్ట్రేలియా జట్టుతో అక్టోబర్ 8న ఆడనుంది. ఇక యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 14న జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్లు, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: వరల్డ్కప్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. క్షణాల్లోనే సైట్ క్రాష్