Fire Accident: హైదరాబాద్ లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాగా, రాజేంద్ర నగర్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలోని టాటానగర్ లో ఉన్న ఓ పరుపు గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అయితే గోదాంకు చుట్టుపక్కల వారు నిద్రలో ఉండగానే తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన వారు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
కాగా, ఈ గోదాం ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తికి చెందింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే గోదాంలో మంటలంటుకున్నాయి. అయితే ఆ సమయంలో గోదాంలో ఉన్న సుమారు 15 లక్షల ఆస్తి అంతా కాలిబూడిదైంది. ఇక పరుపుల తయారీ సామాగ్రికి మంటలంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.