ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం భూములు గుర్తించండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజినల్ రింగ్ రోడ్ కు లోపల 500 నుండి 1000 ఎకరాల భూములను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపే దూరం ఉండాలని సూచించారు.

New Update
ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం భూములు గుర్తించండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజినల్ రింగ్ రోడ్ కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవికూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపే దూరం ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి సోమవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములై ఉండడంతోపాటు సాగుకు యోగ్యంకానివిగా ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల, రైతులకు నష్టం కలుగకుండా ఉండడంతోపాటు కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేవిధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ వణుకుతోంది.. చ‌లి పంజాకు గజగజ వ‌ణుకుతున్న జ‌నం

ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, వాటిలో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యనిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు కేటాయించిన భూముల్లో ఎన్నింటిలో పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యం నివ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మిడిల్ ఈస్ట్, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని కోరారు. పరిశ్రమలకు సోలార్ పవర్ ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సీఎంవో అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షా నవాజ్ కాసి హాజరయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు