Mahesh Babu: ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరద ప్రభావం ఎక్కువై పలు ప్రాంతాలు, గ్రామాలూ నీట మునిగి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి, ఉండడానికి నివాసం లేక వారం రోజుల పాటు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల ముందుకొస్తున్నారు. తమ వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి మహేష్ విరాళం
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన వంతు సహాయంగా రూ. 60 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. రూ. 50 లక్షలు తన తరుపున, మరో రూ. 10 లక్షలు ఆయన AMB సినిమాస్ తరుపున ఇచ్చారు. ఈరోజు ఉదయం మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియోలో మహేష్ బాబు, రేవంత్ రెడ్డి లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు స్టైలిష్ గా టీ- షర్ట్స్ ధరించి కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు వావ్..! హీరో vs సీఎం .. లుక్స్ లో ఎవరు తగ్గట్లేదుగా అంటూ చమత్కారంగా కామెంట్స్ చేస్తున్నారు.
విరాళాలు ప్రకటించిన సినీ తారలు
ఇప్పటికే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్ రూ. కోటి, అల్లు అర్జున్ రూ. కోటి, మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి, మహేష్ బాబు రూ. కోటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ. కోటి, నందమూరి బాలకృష్ణ రూ. కోటి, వైజయంతి రూ. 25లక్షలు, హాసిని హారిక ఎంటర్ టైన్మెంట్స్ రూ. 50 లక్షల, సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, విరాళాలను ముఖ్యమంత్రికి అందజేశారు.