Old city: జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని రూల్స్ పెట్టినా వాటిని తుంగలోకి తొక్కి నగరంలో నిర్మాణాలను చేపడుతూ..చివరికి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా నిర్మాణ ప్రమాణాలు పాటించకపోవడంతో పాతబస్తీలో ఓ జీ ప్లస్ నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగి..స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
ఎప్పుడు కూలిపోతుందో.. తెలియక చుట్టు పక్కల ఉన్న వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పుర హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ 4 అంతస్తుల భవనం ఓ వైవుకు ఒరిగిపోయి..ఏ క్షణంలో అయినా కూలిపోయే స్థితిలో ఉంది. దీంతో స్థానికులు అందించిన సమాచారంతో ఏరియా కార్పొరేటర్ హుస్సేని పాషా ,ghmc అధికారులు, బహదూర్ పుర పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని భవనానికి చుట్టు ప్రక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు.
అయితే ఈ భవన నిర్మాణం అక్రమంగా జరిగిందని.. Ghmc అధికారులు బహదూర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భవన యజమాని పై కేసు నమోదు చేశారు. ఇక భవనాన్ని కూల్చివేయడానికి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో భవన యజమాని 27లక్షల రూపాయలతో ఒప్పందం చేసుకున్నారని కార్పొరేటర్ తెలిపారు.
కొన్ని మిషనరీలు బెంగళూరు నుండి వస్తున్నాయని అని రేపటిలోగా వస్తాయని.. చుట్టుప్రక్కల నిర్మాణాలకు ఎలాంటి హాని కలగకుండా కూల్చివేత జరుగుతుందన్నారు. ఇక ముందస్తుగా ghmc, Drf,పోలీసులు ఉన్నారని చుట్టుప్రక్కల వారు వారి బంధువుల ఇళ్ళకు వెళ్లిపోయారని కిషన్ బాగ్ కార్పొరేటర్ అన్నారు. ఇటు వైపు ఎవరు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు.
తుంగలోకి జీహెచ్ఎంసీ నిబంధనలు..!
నగరంలో చాలా వరకు నిర్మాణాల్లో జీహెచ్ఎంసీ పెట్టిన నిబంధనలను పాటించడం లేదు. చాలా సార్లు జీ ప్లస్ టు అంతస్తులకు పర్మిషన్ తీసుకొని యజమానులు ఇష్టానుసారంగా నాలుగైదు అంతస్తులు కూడా కట్టేస్తున్నారు. తక్కువ స్థలంలో అన్నిఅంతస్థుల భవనాలు నిర్మించడం, అందులో నాణ్యతా లోపాలుండడంతో భవనాలు నిర్మాణ దశలోనే కూలిపోతున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇక సెల్లార్ల విషయంలో అయితే రూల్స్ ఎక్కడా ఫాలో కావడం లేదు. దీంతో భవనాలు కుప్పకూలే ప్రమాదాలున్నాయి.