సెల్ఫీల మోజులో తమంత తామే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా యువతే ఉన్నారు.
కదులుతున్న రైళ్లపై సెల్ఫీలు దిగుతూ, విద్యుదఘాతానికి గురవుతూ చనిపోయిన ఘటనలు కొన్ని ఉంటే ట్రెయిన్ వస్తుండగా రైల్వే ట్రాక్పై వీడియోలకు ఫోజులిస్తూ రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు మరికొన్ని. ఎగిసిపడుతున్న రాకాసి అలలు బలైన ఉందంతాలు ఇంకొన్ని. ఏదైతేనేం వీళ్లందరి మరణ శాసనం రాసింది ఒక సెల్ఫీనే.
తాజాగా కర్ణాటకలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లాలోని భద్రావతి ప్రాంతానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు.. సోమవారం ఉదయం అరసినగుండి జలపాతం చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు.
జలపాతం అంచున బండరాయిపై నిలబడి వీడియోలకు ఫోజులిస్తుండగా కాలుజారి నీళ్లలో పడిపోయాడు. ఆ తర్వాత అమాంతం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
కాగా, సదరు యువకుడు జారిపడి ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు అతని స్నేహితుడి మొబైల్ ఫోన్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నది. కింది వీడియోలో ఉన్న ఆ విషాదకర దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.